Telangana Formation Day: ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష!

తెలంగాణ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ట్యాంక్ బండ్‌పై సాయంత్రం 7-9 అన్ని కళా రూపాలతో కార్నివాల్, ఫుడ్ స్టాల్స్, పిల్లలకు వినోద శాలలు, లేజర్ షో ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారుల సమావేశంలో వెల్లడించారు.

New Update
Telangana Formation Day: ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష!

CS Shanthi Kumari Review: జూన్‌ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవ (Telangana Formation Day) ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల కార్యర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్‌ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌ లోని అమర వీరుల స్థూపం వద్ద అమరులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో (Parade Grounds) నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు..
రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు, సందేశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్‌పై రాష్ట్రం లోని అన్ని కళా రూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నట్టు చెప్పారు. దాంతో పాటు శిక్షణ పొందుతున్న 5 వేల మంది పోలీస్ అధికారులు బ్యాండ్‌తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. ట్యాంక్ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలతో తయారు చేసిన పలు వస్తువులతో పాటు నగరం లోని పేరొందిన హోటల్స్‌తో ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమానికి హాజరయ్యే నగర పౌరులతో వచ్చే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోద శాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్యాంక్ బండ్‌పై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌ బండ్‌పై సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకర్షణీయమైన బాణసంచా ప్రదర్శనతో పాటు లేజర్ షో ఏర్పాటు చేశామని శాంతి కుమారి చెప్పారు.

ఇది కూడా చదవండి: Hema: దూరదర్శన్ లో ప్రేమ.. కెమెరామెన్‌ తో పెళ్లి.. హేమ ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరీ!

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ రవీ గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దాన కిశోర్, శైలజా రామయ్యర్, శ్రీనివాస రాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, అడిషనల్ డీజీలు సంజయ్ కుమార్ జైన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నగర పోలీస్ అడిషనల్‌ కమిషనర్, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు, ఎన్‌పీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్, హెచ్ఎండీఏ అడిషనల్ కమిషనర్ ఆమ్రపాలి కాటా పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు