/rtv/media/media_files/2026/05/15/pakistan-2026-05-15-18-11-27.jpg)
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో ఉన్న పాకిస్థాన్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఊహించని షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన కొద్ది రోజులకే, స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ జట్టుపై ఐసీసీ భారీ జరిమానా విధిస్తూ పాయింట్ల కోత విధించింది.
ఢాకాలోని మీర్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ నిర్ణీత సమయం కంటే 8 ఓవర్లు తక్కువగా వేసినట్లు ఐసీసీ గుర్తించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా, అలాగే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఒక పాయింట్ కోత విధిస్తారు. పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ తన తప్పును అంగీకరించడంతో, మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో ఈ శిక్షను ఖరారు చేశారు.
డబ్ల్యూటీసీ ఆశలపై నీళ్లు
ఈ పాయింట్ల కోత పాకిస్థాన్ డబ్ల్యూటీసీ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ శిక్షకు ముందు వరకు పాకిస్థాన్ ఒక విజయం, రెండు ఓటములతో 12 పాయింట్లు కలిగి ఉండగా.. తాజా 8 పాయింట్ల కోతతో ఆ జట్టు కేవలం 4 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ పాయింట్ల శాతం 11.11కి పడిపోయి, వెస్టిండీస్తో కలిసి పట్టికలో 9వ స్థానానికి చేరుకుంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా (87.5%), న్యూజిలాండ్ (77.8%) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
మీర్పూర్ టెస్టులో పాకిస్థాన్ బ్యాటింగ్ వైఫల్యం మరోసారి బయటపడింది. చివరి రోజు డ్రా కోసం పోరాడాల్సిన పాక్ జట్టు, బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రాణా ధాటికి కుప్పకూలింది. ఒక దశలో 119/3 స్కోరుతో ఉన్న పాకిస్థాన్, అనూహ్యంగా 168 పరుగులకే ఆలౌట్ అయి 104 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
గత ఏడాది లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్పై రెండు పాయింట్ల కోత విధించిన ఐసీసీ, ఇప్పుడు పాకిస్థాన్పై ఏకంగా 8 పాయింట్ల కోత విధించడం ఈ సైకిల్లో అతిపెద్ద పెనాల్టీగా నిలిచింది. ఈ పరిణామం పాకిస్థాన్ ఫైనల్ రేసును మరింత క్లిష్టతరం చేసింది.
Follow Us