పవన్ కళ్యాణ్‌ వీధి రౌడీలా మారిపోయాడు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లను అన్నా తమ్ముళ్లతో పోల్చిన పవన్ కళ్యాణ్‌.. ఇప్పుడు వారిని దండుపాళ్యం బ్యాచ్‌ అనడం ఏంటన్నారు. విశాఖలో పవన్‌ హింస సృష్టించాలని చూస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

New Update
పవన్ కళ్యాణ్‌ వీధి రౌడీలా మారిపోయాడు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుషికొండ వద్ద పవన్‌ ఏదో డ్రామా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటరీ వ్యవస్థను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చడాన్ని ఖండించిన ఆయన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కంటే దండుపాళ్యం బ్యాచ్‌ ఇంకేముంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ప్యాకేజీకి అమ్ముడుపోయారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుస్తకాలు అంటే తనకిష్టమని తాను ఎక్కువ సమయం పుస్తకాలు చదివేందుకే కేటాయిస్తానన్న పవన్‌.. వాటిలో జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివుంటే బాగుండేదని మంత్రి ఎద్దేవా చేశారు.

రుషికొండకు వెళ్లిన పవన్‌ పక్కనే ఉన్న గీతం కాలేజీకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. గీతం కాలేజీని నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని, అది చంద్రబాబు బంధువుకు చెందిన కాలేజీ కాబట్టే పవన్‌ దాని గురించి మాట్లాడటం లేదన్నారు. జగదాంబ సెంటర్‌లో వాలంటీర్‌లను అన్నా తమ్ముళ్లతో పోల్చిన పవన్‌.. వారిని దండుపాళ్యం బ్యాచ్‌ అంటే ఆయన కూడా దండుపాళ్యం బ్యాచ్‌కు చెందిన వ్యక్తే అవుతారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ విషయాన్ని పవన్‌ ఒప్పుకున్నట్లైందని ఆరోపించారు.

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌కు కనీస పరిజ్ఞానం లేదని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ అంటే ఏంటో తెలుసా అని ఆయన పవన్‌ను ప్రశ్నించారు. పవన్‌ తన మాటలను వక్రీకరించారని, తాను విశాఖ వదిలి వెళ్లిపోతానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. నన్ను రాజీనామా చేయమనడానికి పవన్‌ ఎవరని ఎంపీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి తనను రాజీనామా చేయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్‌ ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు చెప్పింది చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ విశాఖను నాశనం చేయాలని చూస్తున్నారని ఎంపీ ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వంపై అంతగా చెలరేగిపోతున్న పవన్‌ కళ్యాణ్‌ తానే సిఎం అభ్యర్థినని చంద్రబాబుతో చెప్పించాలని ఎంవీవీ సత్యనారాయణ సవాల్‌ విసిరారు. పవన్‌ తన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ నాయకుడి లక్షణం ఒక్కటి కూడా లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో గంతులేస్తే నాయకులు కాలేరన్న ఎంపీ.. ప్రస్తుతం వీధి రౌడీకి, పవన్‌కు ఎలాంటి తేడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వీధి రౌడీ రానున్న ఎన్నికల్లో సైతం గెలవలేడని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ధ్వజమెత్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు