/rtv/media/media_files/2026/04/11/exams-2026-04-11-11-52-05.jpg)
బీహార్లోని సివాన్ జిల్లాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆలోచింపజేస్తోంది. రోడ్డు పక్కన వరుసగా కూర్చుని, తలలు వంచుకుని పరీక్షలు రాస్తున్న వందలాది మంది విద్యార్థుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కనీసం కూర్చోవడానికి బెంచీలు, తల పైన కప్పు కూడా లేని చోట.. వాహనాల రద్దీ, జనం రాకపోకల మధ్యే ఆ పిల్లలు ఎంతో ఏకాగ్రతతో పరీక్ష రాస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
నెటిజన్లు రకరకాలుగా
ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మన దేశం డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాస్ రూమ్ల గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేకపోవడం వల్లే ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఇలా రోడ్ల మీద పరీక్షలు పెడుతున్నాయని కొందరు విమర్శిస్తుంటే.. బీహార్లో అక్షరాస్యత తక్కువగా ఉండటానికి ఇలాంటి పరిస్థితులే కారణమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
बिहार के सिवान जिले के किसी कोचिंग संस्थान के बच्चे टेस्ट पेपर दे रहे हैं। pic.twitter.com/5j2fNioKqD
— Pranchal Yadav (@vipul_vns) April 10, 2026
అయితే, ఈ విమర్శల మధ్యే ఆ విద్యార్థుల పట్టుదలను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా, రోడ్డు పక్కనే కూర్చుని అయినా చదువుకోవాలనే వారి కసిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. "తక్కువ వనరులు ఉన్నా, బీహార్ విద్యార్థులు దేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో సీట్లు సాధించడానికి వారిలోని ఈ పోరాట పటిమే కారణం" అని కొందరు కొనియాడుతున్నారు. ఏదేమైనా, ఈ దృశ్యాలు ఒకవైపు విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతుంటే.. మరోవైపు విద్యార్థుల అంతులేని ఆశను ప్రతిబింబిస్తున్నాయి.
Follow Us