Tamil Nadu CM Vijay : 21న విజయ్‌ మంత్రి వర్గ విస్తరణ....15 మందికి చోటు..వారికి అవకాశం లేనట్లే...

తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని సరికొత్త కూటమి ప్రభుత్వం తన మొదటి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 21న (గురువారం) క్యాబినెట్ విస్తరణ జరగనున్నట్లు పార్టీ అధికారిక వర్గాల ద్వారా సమాచారం అందింది.

New Update
vijay

Vijay's cabinet expansion on the 21st

Tamil Nadu CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని సరికొత్త కూటమి ప్రభుత్వం తన మొదటి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 21న (గురువారం) క్యాబినెట్ విస్తరణ జరగనున్నట్లు పార్టీ అధికారిక వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ విస్తరణలో తమిళనాడు వెట్రి కళగం (TVK) ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు కీలక అండగా నిలిచిన మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) పార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. గత మే 10న ముఖ్యమంత్రితో పాటు కేవలం తొమ్మిది మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా, తాజా విస్తరణలో మరో 15 మందిని క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు.

ఈ విస్తరణలో భాగస్వామ్య పార్టీల కోటా కింద కాంగ్రెస్ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు పి.విశ్వనాథన్, ఎస్.రమేష్ కుమార్ మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖరారైంది. అలాగే వీసీకే ,ఐయూఎంఎల్ పార్టీలకు చెరో మంత్రి పదవి దక్కనుంది; అయితే ఈ రెండు పార్టీల నుండి మంత్రులుగా బాధ్యతలు చేపట్టే అభ్యర్థుల పేర్లను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ ఆర్‌.వి. ఆర్లేకర్ తిరిగి చెన్నైకి చేరుకునే సమయంపై బుధవారం సాయంత్రానికి స్పష్టత రానుంది, ఆ వెంటనే గురువారం నాటి ప్రమాణస్వీకార కార్యక్రమ అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.

ఇక గత కొద్దిరోజులుగా తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన అన్నాడీఎంకే (AIADMK) రెబల్ ఎమ్మెల్యేల చేరిక అంశానికి సీఎం విజయ్ పూర్తిగా తెరదించారు. గత వారం అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్ష సందర్భంగా అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఎస్‌పీ వేలుమణి, సీవీ షణ్ముగం సారథ్యంలోని తిరుగుబాటు వర్గం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రెబల్ ఎమ్మెల్యేలకు క్యాబినెట్ బెర్త్‌లు ఇస్తారనే ఊహాగానాలను కొట్టిపారేసిన టీవీకే, వారిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి విజయ్ ఏమాత్రం సుముఖంగా లేరని స్పష్టం చేసింది.

అన్నాడీఎంకే రెబల్ వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకుంటే తాము ఇచ్చే మద్దతుపై పునరాలోచిస్తామని కూటమిలోని మిత్రపక్షాలైన సీపీఎం, వీసీకేలు ఇదివరకే గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో వీసీకే చీఫ్ తిరుమావళవన్ తాజాగా స్పందిస్తూ.. అన్నాడీఎంకే రెబల్స్ ఎవరినీ క్యాబినెట్‌లోకి తీసుకోవడం లేదని తనకు ఉన్నత స్థాయి సమాచారం అందిందని పేర్కొన్నారు. మిత్రపక్షాల అభ్యంతరాలను గౌరవిస్తూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేసిన తిరుమావళవన్, తమ వీసీకే పార్టీ అధికారికంగా ప్రభుత్వంలో భాగస్వామి కాబోతుందనే పరోక్ష సంకేతాలను ఇచ్చారు. ఈ పరిణామంతో విజయ్ కూటమి ప్రభుత్వంలో నెలకొన్న తాత్కాలిక రాజకీయ గందరగోళం పూర్తిగా సర్దుమణిగింది.

Advertisment
తాజా కథనాలు