Sasikala : శశికళ సంచలన నిర్ణయం: కొత్త పార్టీ పేరు, గుర్తు ప్రకటించిన చిన్నమ్మ!

తమిళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాయకులు అంతా సిద్దం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన శశికళ తన పార్టీ పేరును ప్రకటించారు.  

New Update
sasikala

తమిళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాయకులు అంతా సిద్దం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన శశికళ తన పార్టీ పేరును ప్రకటించారు.  ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం (AIPTMMK)గా  వెల్లడించారు. తమ పార్టీ కొబ్బరి తోట గుర్తుపై పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను పంచుకున్నారు.  అంతకుముందు అంటే ఫిబ్రవరి 24న ఆమె రామనాథపురం జిల్లాలోని  కముతిలో జరిగిన బహిరంగ సభలో తన పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె కీలక కామెంట్స్ చేశారు. డీఎంకే పార్టీని అధికార పీఠం నుంచి దించడమే తన లక్ష్యమని శశికళ  వెల్లడించారు. ఎంజీఆర్ హయాంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, జయలలిత కూడా అదే బాటలో అద్భుతమైన పాలన అందించారని గుర్తు చేశారు. అయితే అమ్మ మరణం తర్వాత డీఎంకే ప్రభుత్వం ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తోందని, అందుకే జయలలిత పుట్టినరోజైన ఫిబ్రవరి 24న తాను రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించానని తెలిపారు. ఆ రోజే పార్టీ జెండాను ఆవిష్కరించానని, ఇప్పుడు పార్టీ పేరును ఖరారు చేశానని చెప్పుకొచ్చారు. 

పుదుచ్చేరిలో కూడా పోటీ 

గతంలో ఎంజీఆర్ డీఎంకే నుంచి బహిష్కరణకు గురైనప్పుడు, ఒక కార్యకర్త నమోదు చేసిన ఏఐఏడీఎంకే పార్టీని ఎలాగైతే నడిపించారో, తాను కూడా ఇప్పుడు ఒక కార్యకర్త స్థాపించిన పార్టీలో చేరి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు శశికళ వివరించారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా తమ పార్టీ కొబ్బరి తోట గుర్తుపైనే పోటీ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతలు క్షీణించాయని, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికీ రక్షణ లేదని, నిత్యం గొడవలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు డీఎంకే ప్రభుత్వంపై వారిలో ఉన్న తీవ్ర అసంతృప్తిని తాను గమనించానని చెప్పారు.

ప్రజలు తమను తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందని, తాము ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటామని శశికళ అన్నారు. తమకు కేటాయించిన ఎన్నికల గుర్తులో నాలుగు కొబ్బరి చెట్లు ఉన్నాయని, అది ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. "ఒక్క చెట్టుతో తోట అవ్వదు" అనే సామెత తనకు ఎంతో ఇష్టమని, దాని ప్రకారం తమ పార్టీ సిద్ధాంతాలతో కలిసొచ్చే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలను ఎదుర్కొంటామని వెల్లడించారు. ఎడప్పాడి పళనిస్వామి గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాలే ఆయన సాధించిందేమిటో చెబుతాయని, ప్రజల తీర్పే దైవ నిర్ణయమని వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు