Mamata Banerjee : పాలకులే హంతకులుగా మారుతున్నారు...మమత బెనర్జీ ఘాటు విమర్శలు

తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీపై పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో జరిగిన దాడిపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. "పాలకులు హంతకులుగా మారుతున్నారు..బీజేపీకి ఇది సిగ్గుచేటు" అంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

New Update
FotoJet (58)

Attack on tmc mp abhishek Banerjee

Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఉదంతంపై ఆమె భారతీయ జనతా పార్టీ (BJP) లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. "పాలకులు హంతకులుగా మారుతున్నారు.. బీజేపీకి ఇది సిగ్గుచేటు" అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇటీవల జరిగిన ఎన్నికల హింసలో బాధితుడైన సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి అభిషేక్ బెనర్జీ సోనార్‌పూర్ వెళ్లారని మమతా బెనర్జీ గుర్తుచేశారు. ఆ సమయంలో బీజేపీ అండదండలతో కొందరు దుండగులు తమ జాతీయ ప్రధాన కార్యదర్శిపై అమానుషంగా దాడికి తెగబడ్డారని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ, బెదిరింపులకు లొంగకుండా బీజేపీ గూండాల దాడిలో నష్టపోయిన కుటుంబానికి అభిషేక్ అండగా నిలిచారని ప్రశంసించారు. కనికరంతో కూడిన రాజకీయాలకూ, విద్వేషంతో కూడిన రాజకీయాలకు ఉన్న తేడా ఇదేనని చెప్తూ.. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి హయాంలో చోటుచేసుకుంటున్న బెదిరింపులు, హింస, ప్రతీకార రాజకీయాలు ఇవాళ్టి ఘటనతో మరోసారి బహిర్గతమయ్యాయని విమర్శించారు.

అసలు ఏం జరిగిందంటే..

ఎన్నికల తదనంతర హింసాత్మక ఘటనల బాధితులను పరామర్శించేందుకు సోనార్‌పూర్ వెళ్లిన అభిషేక్ బెనర్జీపై స్థానికులుగా వచ్చిన కొందరు దుండగులు ఒక్కసారిగా రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. పరిస్థితి అంతటితో ఆగకుండా కొందరు వ్యక్తులు ఏకంగా ఆయనపై చేయి చేసుకుని, "దొంగ.. దొంగ" (చోర్.. చోర్) అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ దాడికి దిగారు. ఆ తీవ్ర ఉద్రిక్త సమయాల్లో తలకు హెల్మెట్ ధరించిన అభిషేక్ బెనర్జీకి ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది మానవహారంగా ఏర్పడి రక్షణ కల్పించారు.

ఈ హింసాత్మక దాడిపై ఎంపీ అభిషేక్ బెనర్జీ స్వయంగా స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనను చంపే ఉద్దేశంతోనే ఈ దాడికి ఒడిగట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్రంగా దాడి జరుగుతున్న సమయంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించలేదని ఆయన మండిపడ్డారు. తనపై జరిగిన ఈ ఘాతుకానికి వ్యతిరేకంగా వెనక్కి తగ్గేదే లేదని, దీనిపై చట్టపరంగా న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ దాడిలో గాయపడిన అభిషేక్ బెనర్జీని ఘటన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించి చేర్పించారు.

Advertisment
తాజా కథనాలు