Ravi Prakash : చిన్న ఇంటర్వ్యూ.. పెద్ద వివాదం!

రాహుల్ గాంధీకి క్రమశిక్షణ లేదు. రాహుల్ గాంధీకి హుందాతనం లేదు.భారతదేశం లాంటి దేశాన్ని నడిపించడానికి కావలసిన అనుభవం రాహుల్ గాంధీకి లేదు. నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయం కాదు. గాంధీ కుటుంబం నరేంద్ర మోదీని బలహీనపరచలేదు.

New Update
rahul

ravi-prakash-2026-05-27-18-35-07

-Ravi Prakash

రాహుల్ గాంధీకి క్రమశిక్షణ లేదు. రాహుల్ గాంధీకి హుందాతనం లేదు.భారతదేశం లాంటి దేశాన్ని నడిపించడానికి కావలసిన అనుభవం రాహుల్ గాంధీకి లేదు. నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయం కాదు. గాంధీ కుటుంబం నరేంద్ర మోదీని బలహీనపరచలేదు. గాంధీ కుటుంబమే నరేంద్ర మోదీని మరింత బలోపేతం చేసింది.

రాహుల్ గాంధీ అంత అసమర్థుడే అయితే,  ప్రజలందరూ ఆయన గురించే ఎందుకు అంతగా మాట్లాడుకుంటారు? నాయకత్వ అనుభవమే కొలమానం అయితే,  బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు ఆయనకు ఉన్న అనుభవం ఏంటి? మరి ప్రధానమంత్రి కావడానికి ముందు,  నరేంద్ర మోదీకి ఉన్న ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? భారతదేశ రాజకీయ మార్పులకు, రైట్ వింగ్ విజయాలకు కారణమని చెప్పలేం. బీజేపీ ఎదుగుదల వెనుక మండల్ రాజకీయాలు,  ప్రాంతీయ పార్టీలు, ఆర్థిక సరళీకరణ, ఆర్‌ఎస్‌ఎస్ నెట్‌వర్క్,  మీడియా రంగంలో వచ్చిన మార్పులు, అలాగే మారుతున్న సామాజిక సమీకరణాలు ఉన్నాయి. అసలు ప్రశ్న రాహుల్ గాంధీ గురించి కాదు. అసలు ప్రశ్న 'హిందుత్వ' గురించి. అసలు ప్రశ్న ఏంటంటే..  ప్రతిపక్షాల దగ్గర భారతదేశం కోసం ప్రత్యామ్నాయ దృష్టి  ఉందా లేదా?

అసలు ఈ వివాదం ఏంటి?

చరిత్రకారులు, జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అకస్మాత్తుగా రాహుల్ గాంధీపై ఇంత తీవ్రమైన చర్చకు ఎందుకు దిగారు? రాహుల్ గాంధీ నిజంగానే నరేంద్ర మోదీని ఢీకొట్టలేరా? గాంధీ కుటుంబమే కాంగ్రెస్‌కు అతిపెద్ద బలహీనతగా మారిందా? లేక రామచంద్ర గుహ వంటి విమర్శకులు  ఈ సంక్లిష్టమైన రాజకీయ కథని చాలా సింపుల్‌గా మార్చేస్తున్నారా? గడిచిన కొన్ని రోజులుగా, ఒకే ఒక్క ఇంటర్వ్యూ  కేవలం ఒక రాజకీయ నాయకుడు, ఒక కుటుంబం లేదా ఒక పార్టీకి మాత్రమే  పరిమితం కాకుండా.. అంతకు మించిన పెద్ద చర్చకు తెరలేపింది.  ఎందుకంటే ఈ వివాదం వెనుక,  ఈ రోజు భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ ప్రశ్న దాగి ఉంది: రాహుల్ గాంధీ కాకపోతే మరి ఎవరు? కాంగ్రెస్ కాకపోతే మరి ఏంటి? ఒక ఇంటర్వ్యూ దేశవ్యాప్త చర్చకు ఎలా దారితీసిందో చెప్పే కథే ఇది.

ఈ వివాదానికి కారణమైన వ్యక్తి బీజేపీ నాయకుడు కాదు. కాంగ్రెస్ నాయకుడు కాదు. టీవీ యాంకర్ కాదు. కనీసం రాజకీయ వ్యూహకర్త కూడా కాదు. ఈ చర్చకు కేంద్రబిందువుగా నిలిచిన వ్యక్తి భారతదేశపు అత్యంత గౌరవనీయమైన హిస్టోరియన్, మేధావి రామచంద్ర గుహ. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంతటి రాజకీయ భూకంపాన్ని సృష్టించాయి. ఎందుకంటే గుహ ఎప్పుడూ బీజేపీకి మద్దతుదారుగా ఉన్న వ్యక్తి కాదు. నిజానికి, కొన్నేళ్లుగా గుహ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అత్యంత పదునైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ హయంలో వ్యవస్థల బలహీనత, ప్రజాస్వామ్య విలువల క్షీణత, పెరుగుతున్న మెజారిటేరియన్ రాజకీయాలు, భిన్నాభిప్రాయాలు, వ్యక్తపరిచే హక్కు తగ్గిపోవడంపై ఆయన నిరంతరం రాస్తూనే ఉన్నారు. అటువంటి రామచంద్ర గుహ, రాహుల్ గాంధీని విమర్శించినప్పుడు ప్రజలు దాన్ని శ్రద్ధగా వింటారు. గాంధీ కుటుంబమే నరేంద్ర మోదీ అధికారాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి సహాయపడిందని  ఆయన అన్నప్పుడు, పొలిటికల్ వరల్డ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

దీ వైర్ కి గుహ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత, ఒక ప్రముఖ వార్తాపత్రిక కాలమ్‌లో  ఆ వాదనలను మరింత వివరంగా రాశారు. ఆ ఇంటర్వ్యూ, ఆ వ్యాసం కలిసి ఒక పెద్ద దుమారాన్ని లేపాయి. ఎందుకంటే గుహ చేసింది సాధారణ రాజకీయ విమర్శ కాదు. కాంగ్రెస్ రాజకీయాల పునాదినే ప్రశ్నించే వాదన ఇది. గుహ అసలు ఏం చెప్పారో స్పష్టంగా అర్థం చేసుకుందాం. కేవలం హెడ్‌లైన్స్ కాదు, ఆ తర్వాత సోషల్ మీడియా రియాక్షన్స్ అంతకంటే కాదు..  అసలు విషయం ఏంటో చూద్దాం. ఎందుకంటే గుహ చేసిన వాదనను  మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే,  అంతమంది ఆయనను ఎందుకు వ్యతిరేకించారో, దాడిచేశారో మనకు అర్థం కాదు.

ఈ విమర్శల్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గుహ... రాహుల్ గాంధీ సాధించిన విజయాలను పూర్తిగా తోసిపుచ్చలేదు. నిజానికి, భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్‌ను  పూర్తిగా మార్చడానికి సహాయపడిందని ఆయన అంగీకరించారు. కొన్నేళ్లుగా రాహుల్ గాంధీని ఆయన ప్రత్యర్థులు  ప్రజాసంబంధాలు లేని వ్యక్తిగా, ప్రివిలేజ్డ్ నేతగా, సీరియస్‌నెస్ లేని వ్యక్తిగా చిత్రీకరించారు. కానీ భారత్ జోడో యాత్ర ఆ ఇమేజ్‌ను మార్చేసింది. రాహుల్ దేశవ్యాప్తంగా నడవడం లక్షలాది మంది చూశారు. సాధారణ ప్రజలను కలవడం.. వారి సమస్యలను వినడం.. కార్మికులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, రైతులతో మాట్లాడటం అంతా గమనించారు. ఈ యాత్ర రాహుల్‌కు సరికొత్త రాజకీయ విశ్వసనీయతను  తెచ్చిపెట్టిందని చివరకు ఆయన విమర్శకులు కూడా అంగీకరించారు. కానీ గుహ అభిప్రాయం ప్రకారం, ఆ వేగాన్ని కాంగ్రెస్ వృధా చేసుకుంది. ఎందుకు? ఎందుకంటే 2024 ఎన్నికలు ముగిసిన వెంటనే,  కాంగ్రెస్ మళ్లీ తన పాత అలవాటు అయిన గాంధీ కుటుంబంపై ఆధారపడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ క్షణాన్ని ఉపయోగించుకుని నాయకత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేసి,  కొత్త తరం నాయకులను ముందుకు తీసుకురావడానికి బదులుగా..  కాంగ్రెస్ మళ్లీ గాంధీ కుటుంబం చుట్టూనే తిరగడం ప్రారంభించింది. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని సువర్ణావకాశాలు వచ్చినా... పార్టీ ఇంకా ఏమీ నేర్చుకోలేదు అనడానికి  ఇదే నిదర్శనం అని గుహ వాదిస్తున్నారు.

గుహ చేసిన వాదనలో అత్యంత ప్రధానమైనది ఇదే. కాంగ్రెస్ ఈ రోజు ఒక ఆధునిక రాజకీయ పార్టీలా కాకుండా,  ఒక కుటుంబం ఆధీనంలో నడిచే సంస్థలా పనిచేస్తోందని ఆయన నమ్ముతున్నారు. దీనికి ఆయన చెప్తున్న సాక్ష్యాలు ఏంటి? రాహుల్ గాంధీకి ఇస్తున్న ప్రాధాన్యత.. పెరుగుతున్న ప్రియాంకా గాంధీ పాత్ర.. కొనసాగుతున్న సోనియా గాంధీ ప్రభావం.. అలాగే, పార్టీలో గాంధీ యేతర నాయకులు  నమ్మకమైన పవర్ సెంటర్స్‌గా ఎదగలేకపోవడం. ఈ విధంగా కుటుంబంపైనే ఆధారపడటం వల్ల  కాంగ్రెస్‌కు రెండు విధాలుగా నష్టం జరిగిందని గుహ అంటున్నారు. మొదటిది, ఇది పార్టీ లోపల అంతర్గత పోటీని దెబ్బతీస్తుంది. రెండవది, కాంగ్రెస్‌ను ఒక 'వారసత్వ పార్టీ' అని బీజేపీ  పదే పదే విమర్శించడానికి అవకాశం ఇస్తుంది. కాంగ్రెస్ ప్రతిసారీ గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చినప్పుడల్లా,  అది బీజేపీ చెప్పే వాదనను మరింత నిజం చేసినట్లు అవుతుందని గుహ అభిప్రాయపడ్డారు.

కానీ గుహ చేసిన అత్యంతవివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా ఉన్నాయి. మోదీకి రాహుల్ గాంధీ ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయం కాదు! సోషల్ మీడియాలో విస్ఫోటనం సృష్టించిన వ్యాఖ్య ఇదే. నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ ఇంకా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదని గుహ వాదించారు. ఎందుకు? ఆయన ప్రకారం, రాహుల్ గాంధీలో మూడు బలహీనతలు ఉన్నాయి. ఒకటి: నిలకడైన రాజకీయ దృష్టి  లేకపోవడం. రెండు: హుందాతనం  లోపించడం. మూడు: పరిపాలన అనుభవం లేకపోవడం. రాహుల్ గాంధీ తరచుగా ముఖ్యమైన సమస్యలను లేవనెత్తుతారనే విషయాన్ని గుహ అంగీకరిస్తున్నారు. అది నిరుద్యోగం కావచ్చు.. ఎన్నికల సంఘం కావచ్చు.. వ్యవస్థల స్వయంప్రతిపత్తి కావచ్చు.. లేదా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు.. కానీ గుహ వాదన ప్రకారం, ఈ ఉద్యమాలు, పోరాటాలు సుదీర్ఘ కాలం పాటు  ఒకే స్థిరత్వంతో కొనసాగడం లేదు. ఆధునిక రాజకీయాలకు ప్రతిరోజూ అలసిపోనిసంస్థాగత కృషి  అవసరమని ఆయన అంటారు. రాజకీయ పార్టీలు ప్రతిరోజూ చేసే పని అది. కానీ రాహుల్ ఆ స్థాయి నిలకడను, స్థిరత్వాన్ని తరచుగా చూపించలేకపోయారని ఆయన భావిస్తున్నారు.

ఇక రెండవ విమర్శ విషయానికి వస్తే.. రాహుల్ కొన్నిసార్లు కేవలం సింబలిజంపైనే ఎక్కువగా ఆధారపడతారని గుహ నమ్ముతున్నారు. ప్రజా సంబంధాలు.. ఫోటోలకు పోజులు ఇవ్వడం.. పర్యటనలు.. సౌమ్యంగా ప్రవర్తించడం.. ఇవన్నీ ప్రజల దృష్టిని ఆకర్షించినప్పటికీ,  ఇవి దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలుగా మారుతాయా లేదా అనేదానిపై గుహ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత మూడవ పాయింట్ వస్తుంది. అత్యంత వివాదాస్పదమైన పాయింట్ — అనుభవం. గుహ ఒక సరళమైన ప్రశ్న అడుగుతున్నారు: రాహుల్ గాంధీ ఇప్పటివరకు ఏ ముఖ్యమైన పరిపాలనా బాధ్యతను నిర్వహించారు? ఆయన ఎప్పుడూ ముఖ్యమంత్రిగా పని చేయలేదు. కేబినెట్ పదవిని చేపట్టలేదు. ఒక మంత్రిత్వ శాఖను నడపలేదు. కనీసం ఒక రాష్ట్రాన్ని కూడా పరిపాలించలేదు. కాబట్టి, రాహుల్‌ను కాబోయే ప్రధానమంత్రిగా ప్రెజెంట్ చేసినప్పుడు.. అక్కడ ఒక విశ్వసనీయత లోపం ఏర్పడుతుందని గుహ అంటున్నారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా.. గుహ చేసిన వాదన ఇదే. ఈ వ్యాఖ్యలే తీవ్రమైన రియాక్షన్స్‌కి కారణమయ్యాయి.

ఇప్పటిదాకా మీరు విన్న విమర్శలు, గుహ చేసిన వ్యాఖ్యలు  అత్యంత సాధారణమైనవి.  అసలు వివాదం దీనికంటే పెద్దది. అది రాహుల్ గాంధీ గురించి కాదు.. అసలు గాంధీ కుటుంబం గురించే! గుహ ప్రకారం.. నరేంద్ర మోదీ, అమిత్ షాలు బీజేపీ ఎదుగుదలకు,  అలాగే  అధికారాన్ని చేజిక్కించుకోవడానికి నిస్సందేహంగా కారణమే. కానీ గాంధీ కుటుంబం, వారి చుట్టూ ఉన్న సంస్కృతి కూడా  ఆ ఎదుగుదలను మరింత సులభతరం చేయడంలో మొయిన్ రోల్ పోషించాయి. మరో మాటలో చెప్పాలంటే.. రాహుల్ గాంధీ సమస్యలో చిన్న భాగం మాత్రమేనని గుహ వాదన. గాంధీ కుటుంబం ఇలాగే కొనసాగడం అనేది అసలు సమస్య. ఆ పాయింట్ దగ్గరే ఈ చర్చ కేవలం  రాహుల్ గాంధీ నాయకత్వం గురించిన చర్చగా మిగలకుండా.. ఒక జాతీయ వివాదంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న  "రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని ఓడించగలరా?" అన్నది కాదు. ప్రశ్న ఏంటంటే: "గాంధీ కుటుంబం తెలియకుండానే  నరేంద్ర మోదీ మరింత స్ట్రాంగ్ అవ్వడానికి సహాయపడిందా..? ఈ ఆరోపణ జర్నలిస్టులు, మేధావులు, కాంగ్రెస్ నాయకుల నుండి  తీవ్రమైన ప్రతిఘటనకు దారితీసింది.

ఆ వాదన సారాంశం ఏమిటంటే..  "కాసేపు రాహుల్ గాంధీని మర్చిపోండి. గాంధీ కుటుంబాన్ని మర్చిపోండి. వారసత్వాన్ని మర్చిపోండి. మీ ప్రశ్నే తప్పుగా ఉంది ఈ వాదన రచయిత్రి,  న్యాయవాది అయిన సరయు పానీ నుంచి వచ్చింది. మిగిలిన సమాధానాల్లా కాకుండా, ఆమె విమర్శ కేవలం చరిత్ర గురించి కాదు. అది ఐడియాలజీ గురించి. సరయు పానీ చేసిన పదునైన పరిశీలనలలో ఒకటి ఏంటంటే,  గుహ వాదనలో ఉన్న ఒక కాంట్రడిక్షన్‌ను ఆమె ఎత్తి చూపారు. దాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. గుహ ప్రకారం... గాంధీలు రాజకీయంగా అసమర్థులు. వాళ్లు నరేంద్ర మోదీని ఆపలేకపోతున్నారు. కాంగ్రెస్‌ను పునరుద్ధరించడంలో పదేపదే విఫలమయ్యారు. కానీ అదే సమయంలో... పార్టీలోని ఒక బలమైన ప్రత్యామ్నాయం పైకి రాకుండా  అడ్డుకుంటున్నారని కూడా గుహ వాదిస్తున్నారు. ఇక్కడే సరయు ఒక కాంట్రడక్షన్‌ చూశారు. ఎందుకంటే గాంధీలు నిజంగా అంత బలహీనులైతే... అంత అసమర్థులైతే... మోదీని ఓడించలేనంత అశక్తులైతే... మరి అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయం వారిని ఓడించి ఎందుకు పైకి రాలేకపోతోంది? ఒక బలహీనమైన నాయకుడిని మార్చడం ఎందుకు అసాధ్యం అవుతుంది? ఒక బలహీనమైన కుటుంబం మొత్తం రాజకీయ వ్యవస్థను ఎలా శాసించగలుగుతుంది?

సరయు ప్రకారం, గుహ ఈ ప్రశ్నకు ఎప్పుడూ పూర్తి సమాధానం ఇవ్వలేదు. అక్కడి నుండి ఆమె ఒక పెద్ద వాదన వైపు వెళ్లారు. మనం రాహుల్ గాంధీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? సరయు ప్రకారం, రాహుల్ గాంధీపై అతిగా కేంద్రీకరించడమే సమస్యలో భాగం కావచ్చు. ఎందుకంటే గత దశాబ్ద కాలపు అసలైన రాజకీయ కథ ఒక వ్యక్తి గురించి కాదు. అది ఒక ఐడియాలజీ ఎదుగుదల గురించి. భారతీయ రాజకీయాన్ని మార్చేసిన ఒక సిద్ధాంతం. ప్రజా చైతన్యాన్ని పునర్నిర్మించిన ఒక సిద్ధాంతం. మిలియన్ల కొద్దీ ప్రజలు తమ గుర్తింపు, చరిత్ర, దేశాన్ని అర్థం చేసుకునే విధానాన్ని మార్చిన సిద్ధాంతం. మరో మాటలో చెప్పాలంటే, అసలైన అంశం 'హిందుత్వ'. అదే నిజమైన అంశం అయితే... రాహుల్ గాంధీపైనే అతిగా దృష్టి పెట్టడం వల్ల మన చుట్టూ జరుగుతున్న ఈ పెద్ద మార్పును మనం గమనించకుండా పోయే ప్రమాదం ఉంది.

సరయు ప్రకారం, హిందుత్వ ఎదుగుదలను కేవలం నాయకత్వ వైఫల్యాల ద్వారా వివరించలేము.  దీనిని కేవలం కాంగ్రెస్ తప్పుల ద్వారా మాత్రమే వివరించలేం. లేదా రాహుల్ గాంధీ బలాలు, బలహీనతలకు పరిమితం చేయలేం. బదులుగా, ఆమె ఒక లోతైన ప్రక్రియ జరుగుతోందని వాదిస్తున్నారు. సంవత్సరాలుగా, రాజకీయ కథనాలు మారాయి. సాంస్కృతిక కథనాలు మారాయి. చారిత్రక కథనాలు మారాయి. ఇంటర్నెట్ పొలిటికల్ కమ్యూనికేషన్‌ను మార్చేసింది. సోషల్ మీడియా పొలిటికల్ ఈక్వేషన్స్‌ మార్చేసింది. వీటన్నింటి ద్వారా, హిందుత్వ పెద్ద సంఖ్యలో ఓటర్లతో ఒక బలమైన ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేయడంలో విజయవంతమైంది. ఆ మార్పు, ఒక రాజకీయ కుటుంబం కంటే చాలా పెద్దదని ఆమె వాదిస్తున్నారు. ప్రతిపక్షాల ముందున్న ఒక కఠినమైన ప్రశ్న ఇది సరయును ఒక కఠినమైన కంక్లూజన్‌ వైపు నడిపిస్తుంది. బహుశా ఈరోజు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నాయకత్వం కాదు. బహుశా అది సిద్ధాంతం అంటే, ఐడియాలజీ. ఒక్కసారి ఆలోచించండి.

రేపు రాహుల్ గాంధీ రాజకీయాల నుండి తప్పుకున్నారనే అనుకుందాం. ప్రియాంకా గాంధీ కూడా తప్పుకున్నారనుకుందాం. గాంధీ కుటుంబం క్రియాశీల రాజకీయాల నుండి పూర్తిగా మాయమైపోయిందనే అనుకుందాం. అంతటితో ప్రతిపక్షాల సమస్యలన్నీ ఆటోమేటిక్‌గా తీరిపోతాయా? అది ఆటోమేటిక్‌గా బీజేపీ ప్రభావాన్ని తగ్గించేస్తుందా? అది ఆటోమేటిక్‌గా హిందుత్వను బలహీనపరుస్తుందా? సరయు ప్రకారం, సమాధానం 'లేదు'. ఎందుకంటే సవాలు చాలా లోతైనది. ప్రతిపక్షాలు ఇప్పటికీ ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. భారతదేశం కోసం వారికున్న విజన్ ఏమిటి? వారు ఏ ఆర్థిక నమూనాను అంటే, ఎకనామిక్ మోడల్‌ను అందిస్తున్నారు? వారు నిరుద్యోగాన్ని ఎలా ఎదుర్కొంటారు? అసమానతలను ఎలా పరిష్కరిస్తారు? కుల వివక్షను ఎలా ఎదుర్కొంటారు? పర్యావరణ విధ్వంసాన్ని ఎలా అడ్డుకుంటారు? రిలీజియస్‌ పోలరైజేషన్‌ను ఎలా ఎదుర్కొంటారు? అన్నింటికంటే ముఖ్యంగా... ప్రస్తుతం జాతీయస్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్న రాజకీయ ఆలోచనతో  పోటీ పడగల ఎలాంటి కొత్త రాజకీయ ఊహాశక్తిని అంటే, పొలిటికల్ ఇమాజినేషన్‌ను వారు ఎలా సృష్టించగలరు? సరయు దృష్టిలో, శ్రద్ధ పెట్టాల్సింది ఈ ప్రశ్నలపైనే. ఒక ఇంటిపేరు గురించిన అంతులేని వాదనలపై కాదు. ఇక్కడే చర్చ అకస్మాత్తుగా కాంగ్రెస్ కంటే చాలా పెద్దదిగా మారుతుంది. 

రాహుల్ గాంధీ కంటే చాలా పెద్దదిగా. రామచంద్ర గుహ కంటే చాలా పెద్దదిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ప్రాథమికమైన విషయాన్ని చర్చిస్తున్నాం. సాంప్రదాయ కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పటికీ ప్రస్తుత రాజకీయాలకు సమర్థవంతమైన సమాధానం ఇవ్వగలవా? లేదా ప్రతిపక్షాలకు పూర్తిగా ఒక కొత్త భాష అవసరమా? ఒక కొత్త విజన్ అవసరమా? ఒక సరికొత్త రాజకీయ ఊహాశక్తి అవసరమా? ఇవి కష్టమైన ప్రశ్నలు. సులభమైన సమాధానాలు లేని ప్రశ్నలు. కానీ ఇవి ఆధునిక భారతీయ రాజకీయాల ముందు ఉన్న ప్రశ్నలు. సరయు ప్రకారం, కాంగ్రెస్ అధ్యక్షుడి కుర్చీలో ఎవరు కూర్చుంటారు అనే ప్రశ్న కంటే ఇవే చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ చాలా డ్రమటిక్‌గా డెవలప్‌ అయింది. స్టోరీ ఒక చరిత్రకారుడు ఒక రాజకీయ నాయకుడిని విమర్శించడంతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఇది చరిత్ర గురించిన చర్చగా మారింది. సిద్ధాంతాల గురించిన చర్చగా మారింది. ప్రతిపక్షాల భవిష్యత్తు గురించిన చర్చగా మారింది. సరిగ్గా ఈ చర్చ సిద్ధాంతాల పరిధిలోకి వెళ్తున్న సమయంలోనే... ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రంగంలోకి దిగారు. ఏదో సైద్ధాంతిక వాదనతో కాదు. చారిత్రక వాదనతోనూ కాదు. కానీ రామచంద్ర గుహా చేసిన ఒక నిర్దిష్టమైన క్లెయిమ్‌కు నేరుగా సవాలు విసిరారు.

భారతదేశాన్ని నడపడానికి అవసరమైన అనుభవం రాహుల్ గాంధీకి లేదనే వాదనను ఆయన సవాలు చేశారు. తన వాదనను నిరూపించడానికి ఆయన రెండు పేర్లను ప్రస్తావించారు. ఒకరు బరాక్ ఒబామా.మరొకరు నరేంద్ర మోదీ.ఈ దశకు వచ్చేసరికి, చర్చ మరింత మేధోపరంగా మారింది.చరిత్రకారులు చరిత్రకారులతో వాదిస్తున్నారు.రచయితలు సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు.జర్నలిస్టులు చరిత్ర గురించి చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంభాషణలోకి ప్రవేశించారు.

మిగిలిన వారిలా కాకుండా, ఆయన రామచంద్ర గుహ మొత్తం వాదనను సవాలు చేయలేదు. ఒక నిర్దిష్టమైన పాయింట్‌పై మాత్రమే దృష్టి పెట్టారు. బహుశా ఇది అత్యంత వివాదాస్పదమైన పాయింట్. దేశాన్ని నడపడానికి అవసరమైన అనుభవం రాహుల్ గాంధీకి లేదనే పాయింట్. ఆ నాయకుడు శశి థరూర్. ఆయన సమాధానం చాలా సింపుల్‌గా ఉంది. అనుభవమే గనుక పరీక్ష అయితే... చరిత్ర చాలా కాంప్లె్క్స్ గా మారుతుంది. థరూర్ చెప్పిన మొదటి ఉదాహరణ బరాక్ ఒబామా. అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు, ఒబామా ఎప్పుడూ ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా లేరు. ఆయన ఎప్పుడూ అధ్యక్షుడి క్యాబినెట్‌లో పనిచేయలేదు. ఆయనకు పరిమితమైన విదేశాంగ విధాన అనుభవం మాత్రమే ఉంది. అయినా ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు. అది కూడా ఏదో ప్రశాంతమైన కాలంలో కాదు. ఆయన ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్‌  సమయంలో బాధ్యతలు చేపట్టారు.

అమెరికా విదేశాల్లో యుద్ధాలు చేస్తున్న సమయంలో. పెద్ద భౌగోళిక రాజకీయ సవాళ్లు ఎదురవుతున్న సమయంలో. కాబట్టి థరూర్ ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. దశాబ్దాల పరిపాలనా అనుభవం లేకుండానే ఒబామా అధ్యక్షుడు కాగలిగినప్పుడు... సమానమైన కారణాలతో రాహుల్ గాంధీని మాత్రం ఎందుకు అనర్హుడిగా ప్రకటించాలి? ఈ పోలికతో ఎవరైనా ఏకీభవించినా, విభేదించినా, పాయింట్ అయితే స్పష్టంగా ఉంది. రాజకీయ నాయకత్వం అనేది ఏదో కార్పొరేట్ ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ కాదు. ఖచ్చితమైన రెజ్యూమేలతో రావడం కంటే, తమ శక్తి సామర్థ్యాలతో ఎదిగిన నాయకులతో చరిత్ర నిండి ఉంది. కానీ థరూర్ అంతకంటే ఎక్కువ ఆలోచింపజేసే మరో ఉదాహరణను లేవనెత్తారు.

అదే నరేంద్ర మోదీ. 2014లో ప్రధానమంత్రి కావడానికి ముందు, మోదీ గుజరాత్‌ను పాలించారు. కానీ ఆయనకు అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ ఎంతవరకు ఉంది? గ్లోబల్ డిప్లొమసీని హ్యాండిల్ చేయడంలో ఆయనకు ఎంత ప్రత్యక్ష అనుభవం ఉంది? భారతదేశ అంతర్జాతీయ సంబంధాలను నిర్వహించడంలో ఎంత అనుభవం ఉంది? కానీ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, ఒక పూర్తి వ్యవస్థను పొందారు. దౌత్యవేత్తలు. సైనిక సలహాదారులు.క్యాబినెట్ మంత్రులు.సివిల్ సర్వెంట్లు.విదేశాంగ విధాన సంస్థలు. ఇది థరూర్‌ను మరో వాదన వైపు నడిపించింది. ప్రధానమంత్రులు ఒంటరిగా పాలించరు. ఏ నాయకుడూ జాతీయ సంక్షోభాన్ని ఒంటరిగా ఎదుర్కోడు. ఆధునిక ప్రభుత్వాలు సంక్లిష్టమైన వ్యవస్థలు. వాటికి సంస్థలు,  సలహాదారుల మద్దతు ఉంటుంది. కాబట్టి మొత్తం చర్చను కేవలం ఒక వ్యక్తి యొక్క మునుపటి అనుభవానికి పరిమితం చేయడం తప్పుదారి పట్టించడమే కావచ్చు. రాహుల్ గాంధీ గురించి ఒక భిన్నమైన అభిప్రాయం రాహుల్ గాంధీకి రాజకీయ రెజ్యూమే లేదనే ఆలోచనను కూడా థరూర్ సవాలు చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా, రాహుల్ గాంధీ ఎన్నికల రాజకీయాల్లో రెండు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం గడిపారు.

ఆయన ఒక జాతీయ రాజకీయ పార్టీని నడిపారు. భారతదేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. పార్లమెంట్‌లో తన పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులతో చర్చలు జరిపారు. ఇప్పుడు, విమర్శకులు ఈ అనుభవం సరిపోదని వాదించవచ్చు. ఇతరులు ఇది సరిపోతుందని వాదించవచ్చు. కానీ థరూర్ పాయింట్ ఏమిటంటే, రాహుల్ గాంధీని రాజకీయంగా అనుభవశూన్యుడిగా చిత్రీకరించడం ఒక అతిశయోక్తి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, థరూర్ వారసత్వ వాదనతో పెద్దగా పాలుపంచుకోలేదు.కాంగ్రెస్ సంస్థాగత రికార్డును సమర్థించడానికి ఆయన ఎక్కువ సమయం కేటాయించలేదు. గుహా చేసిన ప్రతి విమర్శను తిప్పికొట్టడానికి ఆయన ప్రయత్నించలేదు. బదులుగా, ఆయన కేవలం ఒకే ఒక ప్రశ్నపై దృష్టి పెట్టారు.

రాహుల్ గాంధీ నిజంగానే దేశాన్ని నడపడానికి అర్హత లేనివారా? ఆయన సమాధానం చాలా స్పష్టంగా ఉంది: 'కాదు'.! బహుశా ఇదే ఈ వివాదాన్ని ఇంత ఆసక్తికరంగా మారుస్తుంది. ఎందుకంటే ఈ హెడ్‌లైన్స్ అన్నింటి వెనుకా... నిజానికి మూడు వేర్వేరు చర్చలు ఒకే సమయంలో జరుగుతున్నాయి. మొదటి చర్చ రాహుల్ గాంధీ గురించి. నరేంద్ర మోదీని సవాలు చేయడానికి అవసరమైన నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయా? రెండవ చర్చ కాంగ్రెస్ పార్టీ గురించి. గాంధీ కుటుంబంపై అది ఆధారపడటం కాంగ్రెస్‌ను బలహీనపరిచిందా? లేక వారసత్వ వాదనను అతిగా చేసి చూపిస్తున్నారా? మూడవ చర్చ వీటన్నింటికంటే చాలా పెద్దది. బీజేపీ ఎదుగుదలకు  ఏది కారణం..? అది కాంగ్రెస్ వైఫల్యమా? లేక బీజేపీ సంస్థాగత, సైద్ధాంతిక విజయమా? లేక గత మూడు దశాబ్దాలుగా భారతదేశాన్ని మార్చేసిన లోతైన సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ మార్పుల ఫలితమా? రామచంద్ర గుహ ఒక సమాధానం ఇచ్చారు. ఆయన విమర్శకులు మరికొన్ని సమాధానాలు ఇచ్చారు. బహుశా అందుకే ఈ చర్చ ఇంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. ఎందుకంటే ఇది కేవలం ఒక ఇంటర్వ్యూ గురించి కాదు. ఇది ఒక రాజకీయ నాయకుడి గురించి కూడా కాదు.

ఇది ప్రతిపక్షాల భవిష్యత్తు గురించి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి. అంతిమంగా, భారతీయ రాజకీయాల భవిష్యత్తు దిశ గురించి. అసలైన వివాదం రామచంద్ర గుహా ఏం చెప్పారు అనేది కాదు. అసలైన వివాదం ఏమిటంటే, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు భారతదేశ ప్రతిపక్షాల దగ్గర సమాధానం ఉందా లేదా? ఆ ప్రశ్నలు అసలు అడగాల్సిన సరైన ప్రశ్నలేనా కాదా?

Advertisment
తాజా కథనాలు