/rtv/media/media_files/2026/04/18/modi-2026-04-18-19-56-54.jpg)
ప్రతిపక్షాల నీచ రాజకీయాల వల్ల మా గొప్ప ప్రయత్నాలు దెబ్బతిన్నాయన్నారు ప్రధాని మోదీ. కానీ తమిళనాడు ప్రజలు ఎన్నికల్లో వారికి గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఈ వైఫల్యానికి ప్రతిపక్షాల వైఖరే కారణమని ధ్వజమెత్తారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో కృషి చేసినప్పటికీ, డీఎంకే, కాంగ్రెస్ మరియు వాటి మిత్రపక్షాలు తమ స్వార్థపూరిత, నీచ రాజకీయాల కోసం ఈ బిల్లును అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు.
క్రెడిట్ అంతా ప్రతిపక్షాలే
సాధారణ కుటుంబాలకు చెందిన సోదరీమణులు కూడా చట్టసభల్లో అడుగుపెట్టి, దేశ గమనాన్ని నిర్దేశించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఈ క్రెడిట్ అంతా ప్రతిపక్షాలే తీసుకోవాలని తాను సూచించినప్పటికీ, వారు మాత్రం పట్టుదలతో ఈ బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. ముఖ్యంగా తమిళనాడు ప్రయోజనాల విషయంలో డీఎంకే ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే తమిళనాడుకు మరిన్ని లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, డీఎంకేకు అది ఇష్టం లేదని మోదీ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఆ పార్టీకి ముఖ్యమని ఆయన దుయ్యబట్టారు.
Follow Us