/rtv/media/media_files/2026/05/23/petrol-and-diesel-prices-hiked-2026-05-23-06-52-22.jpg)
Petrol and Diesel Prices hiked
Petrol prices : దేశంలో సామాన్యుడిపై 'పెట్రో వడ్డన' విరామం లేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమనడంతో.. ఆ భారాన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వినియోగదారులపైకి నెట్టేస్తున్నాయి. మరోసారి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సగటున 87 పైసల నుండి 91 పైసల వరకు పెంచారు. వీటితో పాటు సీఎన్జీ (CNG) ధర కూడా కిలోకు రూ. 1 చొప్పున పెరిగింది.పశ్చిమాసియా (అమెరికా-ఇరాన్) ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరల సవరణ ప్రక్రియ మొదలైన కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి. ఈ స్వల్ప వ్యవధిలోనే లీటరు పెట్రోల్, డీజిల్పై దాదాపు రూ. 5, అలాగే సీఎన్జీపై కిలోకు రూ. 4 మేర అదనపు భారం పడింది.ఈ తాజా పెంపుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు పెరిగాయి.పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్ లో ₹ 112.84, డీజీల్ లీటరు ధర₹ 100.94 గా ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్, డీజీల్ ధరలు ₹ 114.40, ₹ 102.13గా ఉంది.
కాగా ఇంధన ధరల పెంపు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా చమురు ధరలు 20 శాతం నుండి 100 శాతం వరకు పెరిగినా, భారత్లో మాత్రం పెట్రోల్పై కేవలం 5 శాతం, డీజిల్పై 5.3 శాతం మాత్రమే పెంచి నియంత్రణలో ఉంచామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర రూ. 112 దాటడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధిక వ్యాట్ (VAT) పన్నులే కారణమని కేంద్రం ఆరోపించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, హరియాణా, గోవా, అసోం వంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధర ఇప్పటికీ రూ. 102 కంటే తక్కువగానే ఉందని కేంద్రం గుర్తుచేసింది.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు."కేంద్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో నిస్సిగ్గుగా దోచుకుంటోంది. ఇంధనంపై వేల కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తున్నా బీజేపీ ఆకలి తీరడం లేదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఇవ్వని ప్రభుత్వం, ఇప్పుడు భారాన్ని మాత్రం వేగంగా బదిలీ చేస్తోంది." అని ఆరోపించారు.
క్రిసిల్ (CRISIL) నివేదిక ప్రకారం.. ఈ మూడు విడతల పెంపు తర్వాత కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి కారణంగా కంపెనీలకు పెట్రోల్పై లీటరుకు రూ. 10, డీజిల్పై లీటరుకు రూ. 13 చొప్పున అండర్-రికవరీ (నష్టం) వస్తోందని నివేదిక పేర్కొంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వివరణ:దేశంలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న పుకార్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొట్టిపారేసింది.దేశంలో డిమాండ్కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంది, ప్రజలు పానిక్ బయింగ్ (ఆందోళనతో ముందే కొనుగోలు చేయడం) చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం దేశంలో పంట కోతల కాలం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్ వినియోగం పెరిగింది.ప్రైవేటు బంకుల్లో ధరలు విపరీతంగా పెరగడం వల్ల వాహనదారులు ప్రభుత్వ రంగ (IOC, BPCL, HPCL) బంకులకు పోటెత్తారు, దీనివల్ల కొన్ని అవుట్లెట్లలో తాత్కాలికంగా రద్దీ ఏర్పడిందే తప్ప కొరత లేదని ఐవోసీ స్పష్టం చేసింది.
Follow Us