/rtv/media/media_files/2026/05/15/neet-2026-05-15-20-11-54.jpg)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కీలక పురోగతి సాధించింది. ఈ భారీ కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పుణెకు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
పి.వి. కులకర్ణి గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరపున పరీక్షా ప్రక్రియలో ప్యానెల్ మెంబర్గా పనిచేశారు. ఈ క్రమంలో ఆయనకు ప్రశ్నపత్రాలను రూపొందించే బృందంతో సంబంధాలు ఉండటంతో, మే 3న జరిగిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ముందే పొందినట్లు సీబీఐ గుర్తించింది.
విద్యార్థులకు రహస్య కోచింగ్
ఏప్రిల్ చివరి వారంలో పుణెలోని తన నివాసంలో కులకర్ణి కొంతమంది విద్యార్థులకు రహస్య కోచింగ్ ఇచ్చారు. ఈ సెషన్లో ఆయన కెమిస్ట్రీ ప్రశ్నలను, వాటి ఆప్షన్లను, సరైన సమాధానాలను విద్యార్థులకు నేరుగా నోట్స్ రాయించారు. విద్యార్థుల నోట్బుక్స్లో రాసుకున్న ప్రశ్నలు, మే 3న వచ్చిన అసలు నీట్ ప్రశ్నపత్రంతో అక్షరం పొల్లుపోకుండా సరిపోలడం గమనార్హం.ఈ రహస్య శిక్షణ తరగతులకు హాజరైనందుకు ఒక్కో విద్యార్థి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం.
కులకర్ణికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీషా వాఘ్మరే అనే మహిళను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమె పుణెలో బ్యూటీ సెలూన్ నడుపుతారని, విద్యార్థులను సమీకరించడంలో ఈమె కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. రాజస్థాన్ పోలీసులు తొలుత గుర్తించిన ఈ గెస్ పేపర్ లీకేజీలో కెమిస్ట్రీకి సంబంధించిన 45 ప్రశ్నలు, బయాలజీకి సంబంధించిన 90 ప్రశ్నలు యథాతథంగా ఉన్నట్లు తేలడంతో మే 12న కేంద్ర ప్రభుత్వం నీట్-2026 పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఈ లీకేజీ నేపథ్యంలో రద్దు చేయబడిన నీట్-యుజి 2026 పరీక్షను తిరిగి జూన్ 21 న నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది. ఈ కుంభకోణం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. జైపూర్, గుర్గావ్, నాసిక్ వంటి నగరాల్లో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు.
Follow Us