/rtv/media/media_files/2026/06/09/cid-2026-06-09-17-06-45.jpg)
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు సెర్చ్ వారెంట్తో ఆమె నివాసానికి చేరుకున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 71 ఏళ్ల మమతా బెనర్జీ, ఇప్పటికే పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలతో ఇబ్బంది పడుతుండగా, ఇప్పుడు ఈ సీఐడీ సోదాలు ఆమెను మరింత రాజకీయ ఇరకాటంలోకి నెట్టాయి.
అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్కు పంపిన ఒక అధికారిక లేఖలో పార్టీ ఎమ్మెల్యేల నకిలీ సంతకాలను ఉపయోగించారనే ఆరోపణలపై సీఐడీ బృందం విచారణ జరుపుతోంది. ఆ లేఖలో శోభన్దేవ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయడానికి ఎమ్మెల్యేలందరూ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ లేఖలోని సంతకాలు ఫోర్జరీవని ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదైంది.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కు
తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు - రీతబ్రత బెనర్జీ, సందీపన్ సాహా మే 27వ తేదీన స్పీకర్ రతీంద్ర బోస్ను కలిసి అసలు నిజాన్ని వివరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మే 6వ తేదీన జరిగిన పార్టీ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడి ఎంపికకు సంబంధించి ఎలాంటి తీర్మానం చేయలేదని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కు చెప్పారు. స్పీకర్కు పంపిన లేఖలో పేర్కొన్నట్లు తాము ఆ రోజు సంతకాలు చేయలేదని, చాలా రోజుల తర్వాత మే 19వ తేదీన మాత్రమే తాము పార్టీ మీటింగ్ రిజల్యూషన్ బుక్లో సంతకాలు చేశామని వారు స్పష్టం చేశారు.
మే 6వ తేదీన జరిగిందని చెబుతున్న ఆ తీర్మానం పూర్తిగా సృష్టించినది, నకిలీది అని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆరోపించారు. అంతేకాకుండా, ఆ లేఖలో ఉన్న మొత్తం 70 సంతకాలలో దాదాపు 14 సంతకాలను కేపిటల్ అక్షరాలలో రాశారని వారు వేలెత్తి చూపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సువేందు అధికారి బహిరంగంగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించిన కొద్ది నిమిషాల్లోనే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో తృణమూల్ కాంగ్రెస్ వారిద్దరినీ పార్టీ నుండి బహిష్కరించింది.
Follow Us