/rtv/media/media_files/2026/06/04/modi-2026-06-04-21-10-51.jpg)
పంజాబ్ రాజకీయం ఇప్పుడు ఒక్కసారిగా వేడెక్కింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ భూపీందర్ సింగ్ హూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి. అమరీందర్ సింగ్తో ఇప్పటికీ తమకు మాట్లాడే మార్గాలు ఉన్నాయని, ఆయన తమకు పాత మిత్రుడని హూడా అనడంతో ఈ టాపిక్ మొదలైంది. అయితే ఆ తర్వాత ఆయన వివరణ ఇస్తూ.. మేము వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాం కానీ, ఆయన కాంగ్రెస్లోకి వస్తున్నారని నేను అనలేదు అని సర్దిచెప్పారు.
రాహుల్ గాంధీని బహిరంగంగా మెచ్చుకోవడం
కానీ, అమరీందర్ సింగ్ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బహిరంగంగా మెచ్చుకోవడం విశేషం. కెప్టెన్ సోదరుడు చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారని, అది తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని ఆయన చెప్పారు. మరోవైపు, పంజాబ్ బీజేపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల పంజాబ్ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేవల్ సింగ్ థిల్లాన్ను నియమించారు. ఈ విషయంలో తనను అస్సలు సంప్రదించలేదని కెప్టెన్ అసంతృప్తిగా ఉన్నారు. దానికి తగ్గట్టే, కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకునే మెయిన్ ప్రోగ్రామ్కు కూడా అమరీందర్ సింగ్ వెళ్లలేదు.
గతంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూతో వచ్చిన గొడవల వల్ల కాంగ్రెస్ను వీడి సొంత పార్టీ పెట్టుకుని, ఆ తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేసిన కెప్టెన్.. ఇప్పుడు బీజేపీ పనితీరుపై అంత హ్యాపీగా లేరనే టాక్ నడుస్తోంది. మరి ఆయన నిజంగానే పాత గూటికి చేరుకుంటారా లేదా అనేది పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ కెప్టెన్ అమరీందర్ సింగ్ గనుక మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరితే, అది పంజాబ్ రాజకీయాల్లో సంచలన పరిణామం అవుతుంది. వయసు పైబడటం వల్ల ప్రస్తుతం ఆయన అంత యాక్టివ్గా లేకపోయినప్పటికీ.. రెండుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం, పంజాబ్ రాజకీయాలపై ఆయనకున్న పట్టు కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని ఇస్తాయి. పంజాబ్లో మళ్లీ పూర్వవైభవం తెచ్చుకోవాలని చూస్తున్న కాంగ్రెస్కు ఆయన రాక ప్లస్ అవుతుంది.
Follow Us