/rtv/media/media_files/2025/07/07/dk-shiva-kumar-responds-on-cm-change-allegations-in-karnataka-2025-07-07-15-43-32.jpg)
EOW notices to DK Shivakumar
BREAKING: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు ఈవోడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక విషయాలు, లావాదేవీలపై శివకుమార్ వివరణ కోరుతూ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19లోపు వివరాలు సమర్పించాలని ఈవోడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై దిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంలో నగదు అక్రమ చలామణి జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, ఎంపీ డీకే సురేష్లకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో యంగ్ ఇండియన్ సంస్థకు ఇచ్చిన రూ.2.5 కోట్ల విరాళాల వివరాలు, మూలం, ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు డిసెంబర్ 19లోపు సమర్పించాలని ఆదేశించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అగ్ర నేతలు తమ పదవుల్ని దుర్వినియోగం చేశారనేది ఆ ఫిర్యాదు. ఈడీ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో వారిపై నేరపూరిత కుట్ర సంబంధిత అభియోగాలు మోపారు. ఆ జాబితాలో మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబె, శాం పిట్రోడా కూడా ఉన్నారు. వీరందరూ కేవలం రూ.50 లక్షలు చెల్లించి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని ఆరోపించింది.
కాగా శివకుమార్కు పంపిన నోటీసుల్లో సంబంధిత డాక్యుమెంట్లు పంపినా, తమ ముందు వ్యక్తిగతంగా హాజరైనా..సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు. ఆ నోటీసులలో ప్రధానంగా యంగ్ ఇండియన్కు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ డబ్బు ఎందుకు ఇచ్చారు.. ఏ ఉద్దేశ్యంతో ఇచ్చారో చెప్పాలన్నారు. అందుకు డొనేషన్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, AICC నేతలతో ఈ లావాదేవీపై ఏదైనా చర్చ జరిగిందా? ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలంటూ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ పోలీసులు డీకే శివకుమార్కు ఇచ్చిన నోటీసుల్లో ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)లు యంగ్ ఇండియన్ సంస్థలో 38 శాతం చొప్పున షేర్లు కలిగి ఉన్నారని ఈడీ ఆరోపించింది. ఏజేఎల్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.90.21 కోట్ల రుణాన్ని రూ.9.02 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్చి.. ఆ షేర్లను రూ.50 లక్షలకు యంగ్ ఇండియన్కు బదిలీ చేశారని పేర్కొంది. తద్వారా రూ.2 వేల కోట్ల నుండి రూ.5 వేల కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ సాధించారని ఈడీ ఆరోపించింది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) సెక్షన్లు 3, 4, మరియు 70 కింద వారిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఏప్రిల్ 11, 2025న ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలలో రూ.661 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను సైతం ఆటాచ్ చేసిన విషయం తెలిసిందే.
Follow Us