/rtv/media/media_files/2026/05/20/tmc-protests-in-front-of-kolkata-assembly-2026-05-20-18-31-47.jpg)
TMC protests in front of Kolkata Assembly
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎన్నికల ఓటమి తర్వాత రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలదొక్కుకునేందుకు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు అట్టడుగు స్థాయిలోనే విఫలమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం కోల్కతాలోని అసెంబ్లీ ప్రాంగణంలో టీఎంసీ చేపట్టిన మొట్టమొదటి భారీ నిరసన ప్రదర్శనే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. పార్టీ ఎమ్మెల్యేల గైర్హాజరు ఇప్పుడు తృణమూల్లో అంతర్గత కలహాలను, అసమ్మతిని బహిర్గతం చేస్తోంది.
Under the BJP rule , a “bulldozer policy” has become synonymous with the eviction of the poor and the destruction of livelihoods.
— All India Trinamool Congress (@AITCofficial) May 20, 2026
Trinamool Congress legislators protested outside the Legislative Assembly against this oppressive and anti-people governance. We strongly condemn… pic.twitter.com/8dOJF4KB4f
ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, అలాగే నూతన ప్రభుత్వం వీధి వ్యాపారులపై (హాకర్స్) చేపట్టిన అక్రమ ఆక్రమణల తొలగింపు చర్యలను నిరసిస్తూ బుధవారం అసెంబ్లీలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎంసీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. అయితే, పార్టీకి ఉన్న మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 35 మంది మాత్రమే ఈ నిరసన కార్యక్రమానికి హాజరు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సగానికి పైగా ఎమ్మెల్యేలు మొదటి పెద్ద నిరసన కార్యక్రమానికి రాకపోవడం పార్టీలో భవిష్యత్తు తిరుగుబాటుకు సంకేతమా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది.
నిజానికి, ఈ నిరసన ప్రదర్శనకు ఒకరోజు ముందే కోల్కతాలోని కాళీఘాట్లో మమతా బెనర్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. కేవలం ఏసీ గదుల్లో, మూసి ఉన్న తలుపుల వెనుక కూర్చుని వ్యూహాలు రచిస్తే పోయిన రాజ్యాధికారాన్ని తిరిగి సాధించలేమని, తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ రోడ్లపైకి వచ్చి ప్రజా పోరాటాలు చేయాలని కొందరు నేతలు నిర్మొహమాటంగా సూచించారు. అధికారం కోల్పోయిన తర్వాత లీడర్షిప్ వైఖరిలో దూకుడు తగ్గిందని, ప్రజా సమస్యలపై పార్టీ మునుపటిలా స్పందించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే.. సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాల నుండి వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన సుదీర్ఘ వీధి పోరాటాల ద్వారానే ఆ పార్టీ ఇన్నాళ్లూ తన ఉనికిని చాటుకుంది. ప్రజా ఉద్యమాలే టీఎంసీకి అసలైన బలం, గుర్తింపు. అలాంటి పార్టీ, 15 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత అధికారం కోల్పోయి రోడ్డుపైకి వచ్చిన మొదటి రోజే ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టలేకపోవడం దాని పతనానికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిరసనలో సోవాందేబ్ చట్టోపాధ్యాయ, నయనా బెనర్జీ, కునాల్ ఘోష్, రిత్ బ్రతా బెనర్జీ వంటి కొద్దిమంది ప్రముఖ ముఖాలు మాత్రమే కనిపించాయి.
అయితే, ఈ వ్యవహారంపై టీఎంసీ శాసనసభా పక్ష సీనియర్ నేత, ప్రతిపక్ష నేత రేసులో ఉన్న సోవాందేబ్ చట్టోపాధ్యాయ స్పందిస్తూ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిరసన కార్యక్రమాన్ని కేవలం ఒక్కరోజు ముందే ప్లాన్ చేయడం వల్ల సుదూర ప్రాంతాలలో ఉన్న ఎమ్మెల్యేలు సమయానికి రాలేకపోయారని ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, ఎన్నికల తదనంతర హింసతో ప్రభావితమైన ప్రాంతాల్లో చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలను కాపాడుకునే పనిలో బిజీగా ఉండటం వల్లే రాలేకపోయారని, ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
ఏదేమైనప్పటికీ, సుదీర్ఘకాలం అధికారంలో ఉండి అకస్మాత్తుగా ప్రతిపక్ష పాత్రలోకి మారినప్పుడు ఇటువంటి సవాళ్లు సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం టీఎంసీ ముందున్న అతిపెద్ద సవాలు.. కేవలం ప్రభుత్వ విధానాలపై పోరాడటం మాత్రమే కాదు, ఓటమితో నైరాశ్యంలో ఉన్న సొంత పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం. పార్టీ లీడర్షిప్ రోడ్లపైకి వచ్చి పోరాడటానికి వెనుకాడుతోందనే భావన గనుక ఎమ్మెల్యేలలో బలపడితే, రాబోయే రోజుల్లో టీఎంసీ మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. మమతా బెనర్జీ తన పాత శైలి ఉద్యమ పంథాలోకి వచ్చి పార్టీని ఎలా కాపాడుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
Follow Us