/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-2026-05-13-18-01-35.jpg)
Bandi Bhagirath
బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కు సిట్ అధికారులు బుధవారం విచారణకు రావాలని నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కానీ ఈరోజు భగీరథ్ విచారణకు రాకపోవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా భగీరథ్ సిట్ నోటీసుపై స్పందించారు. తాను ఎల్లుండి విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు సిట్ అధికారులకు లేఖ రాశారు. కీలక ఆధారాలతో సిట్ ముందుకు వస్తానని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 8న బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. జూన్ 2025లో బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఓ ఫామ్హౌస్లో మద్యం తాగించి తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు భగీరథ్పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేయాలంటూ విపక్ష పార్టీల నేతల, నెటిజన్లు డిమాండ్ చేశారు.
ఈ కేసు తీవ్రత పెరగడంతో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు డీజీపీ సి.వి. ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్ మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని చెప్పారు.
బండి భగీరథ్ తనపై పోక్సో కేసు నమోదు కావడానికి ముందుగానే ఆ బాలికనే తనను హనీ ట్రాప్ చేసిందని కరీంనగర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల కుటుంబం రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తోందని తెలిపారు. అంతేకాదు బండి భగీరథ్ తనపై పోక్సో కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఎల్లుండి సిట్ అధికారుల ముందు హాజరై తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తానని చెప్పారు.
Follow Us