BIG BREAKING: విజయ్ ప్రమాణ స్వీకారానికి మళ్లీ బ్రేక్.. తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్!

తమిళనాడు రాజకీయాలు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ విజయ్ ఇప్పటికే మూడు సార్లు గవర్నర్‌ను కలిసి విన్నవించుకున్నారు. పూర్తి సంఖ్యాబలం ఉన్నప్పటికీ గవర్నర్ ఆయనకు అపాయింట్ ఇవ్వకపోవడం చర్చనీయంశమైంది.

New Update
FotoJet - 2026-05-09T181627.032

Tamil Nadu Governor

BIG BREAKING:  తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ లేని విధంగా అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతున్నాయి. సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ చుట్టూ తిరుగుతున్న ఈ పరిణామాలు నిమిష నిమిషానికీ ఒక కొత్త మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి విజయ్ చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ రూపంలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అతిపెద్ద పక్షంగా అవతరించిన విజయ్ వర్గం.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్ భవన్ (లోక్‌భవన్) కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ విజయ్ ఇప్పటికే మూడు సార్లు గవర్నర్‌ను కలిసి విన్నవించుకున్నారు. కానీ, ప్రతిసారీ ఆయనకు నిరాశే ఎదురైంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస సంఖ్యాబలం (రాతపూర్వక మద్దతుదారులైన ఎమ్మెల్యేల జాబితా) విజయ్ వద్ద లేదనే సాకును చూపిస్తూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయన విజ్ఞప్తిని వరుసగా మూడు సార్లు తిరస్కరించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరించడానికి విజయ్ ప్రయత్నించగా, ఆయనకు గవర్నర్ కనీసం మాట్లాడేందుకు కూడా సమయం (అపాయింట్‌మెంట్) ఇవ్వలేదు. అయినప్పటికీ ఆశతో లోక్‌భవన్ వరకు వెళ్లిన విజయ్, అక్కడ గవర్నర్ అందుబాటులో లేకపోవడం, అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో తీవ్ర అసంతృప్తితో వెనుదిరగాల్సి వచ్చింది.

ఈ రాజకీయ డ్రామా ఇలా నడుస్తుండగానే, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ హఠాత్తుగా కేరళ పర్యటనకు వెళ్తుండటం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో గవర్నర్ కేరళకు వెళ్లడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ లోక్‌భవన్‌కు చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందే, వామపక్షాల (సీపీఎం) అగ్రనేతలు కొందరు అక్కడకు చేరుకున్నారు. గవర్నర్ తీరును ప్రశ్నిస్తూ, విజయ్‌కు మద్దతుగా లోక్‌భవన్‌కు వెళ్లిన సీపీఎం నాయకులను లోక్‌భవన్ సిబ్బంది గేటు వద్దే నిలిపివేసి, లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపించివేయడం తీవ్ర దుమారానికి దారితీసింది.

గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అవలంబిస్తున్న ఈ తీరుపై వామపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే గవర్నర్ వ్యవహరిస్తున్నారని, తమిళనాడులో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని వారు నిప్పులు చెరిగారు. సంఖ్యాబలాన్ని నిరూపించుకోవడానికి అసెంబ్లీ వేదికగా అవకాశం ఇవ్వాలి తప్ప, రాజ్ భవన్ వేదికగా నిర్ణయాలు తీసుకుంటూ కాలయాపన చేయడం రాజ్యాంగ విరుద్ధమని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. నిమిష నిమిషానికీ మారుతున్న ఈ రాజకీయ పరిణామాలు తమిళనాడును ఏ తీరానికి చేరుస్తాయోనన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు