/rtv/media/media_files/2026/04/10/mumbai-airport-2026-04-10-11-22-38.jpg)
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న ఒక భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. ఏకంగా 24 మంది విదేశీ మహిళలు కిలోల కొద్దీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. వీరి నుంచి సుమారు 37.74 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆపరేషన్ ధహాబు
కెన్యా రాజధాని నైరోబి నుండి కొంతమంది మహిళలు భారీగా బంగారాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఆపరేషన్ ధహాబు చేపట్టారు. విమానం దిగగానే అనుమానిత 24 మంది విదేశీ మహిళలను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వారు తమ బ్యాగుల్లో, లోపల వేసుకున్న బట్టల్లో అత్యంత చాకచక్యంగా బంగారాన్ని దాచి ఉంచారు.
✈️ DRI seizes 29.37 kg gold worth Rs 37.74 crore at Mumbai airport
— Swarajya (@SwarajyaMag) April 10, 2026
👮 24 women carriers arrested in Operation Dhahabu Blitz
⚠️ Organised gold smuggling syndicate used trained carriers to evade detectionhttps://t.co/NYea9WBQLQ
అధికారుల సోదాల్లో మొత్తం 29.37 కిలోల బంగారం బయటపడింది. ఇందులో 25.1 కిలోల బంగారు బిస్కెట్లు ఉండగా, మిగిలిన 4.27 కిలోలు బంగారు ఆభరణాల రూపంలో ఉంది. ఈ మహిళలందరూ ఎయిర్పోర్ట్ తనిఖీల నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రత్యేక శిక్షణ పొందినట్లు అధికారులు గుర్తించారు. దీని వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం ఈ 24 మంది మహిళలను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. కేవలం కూలీ కోసం పనిచేసే వీరి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ బంగారం ఎక్కడికి వెళ్తోంది? అనే విషయాలపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ ఏడాది ముంబై ఎయిర్పోర్ట్లో జరిగిన అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్ దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది.
Follow Us