కేంద్రంపై ఏంపీ నామా నాగేశ్వర్‌రావు ఆగ్రహం

లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చ‌ర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన ఎంపీ నామా.. విభ‌జ‌న చ‌ట్టం హామీల‌ను నెర‌వేర్చాల‌ని 9 ఏంళ్లుగా కేంద్రాన్ని కోరుతున్న‌ప్ప‌టికీ, ఎలాంటి స్పంద‌న లేద‌న్నారు. కేంద్రం స‌హ‌క‌రించ‌కున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు

author-image
By Karthik
New Update
కేంద్రంపై ఏంపీ నామా నాగేశ్వర్‌రావు ఆగ్రహం

అవిశ్వాస తిర్మానంపై రెండోరోజు లోక్‌సభ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని ఎంపీ తెలిపారు. రాష్ట్రంలోని కాజీపేటకు రైల్వే కోచ్‌కును కేటాయించాలని కేంద్రానికి ఎన్నో సార్లు లేఖలు రాశామని, లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో స్వయంగా మంత్రులతో మాట్లాడామని ఆయన గుర్తు చేశారు. కానీ కేంద్రం మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలను కేటాయించినట్లు ఎంపీ తెలిపారు.

అంతే కాకుండా నవోదయా విద్యాలయాలు రాష్ట్రానికి కేటాయించాలని కోరామని, ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ కావాలని అడిగామన్న ఆయన.. వీటిలో కూడా తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యే చూపించిందని విమర్శించారు. తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ మాత్రమే కేటాయించినట్లు ఎంపీ తెలిపారు. దీంతో విద్యలో కేంద్రపై ఆధారపడకుండా సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతీ జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉందని, రాష్ట్రంలో మెడిసిన్‌ చదివే విద్యార్థులకు చదవు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా తమ ప్రభుత్వం మెరుగైన విద్యను అందిస్తోందని ఎంపీ వెల్లడించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఆగం చేయాలని చూసిందన్న ఆయన.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం రైతులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చి రైతులు పండించిన ధాన్యాన్ని వారి కళ్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు.

దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకొని ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తున్నామన్నారు. ప్రాజెక్టు నిర్మించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కూడా గ్రామాల్లో చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయన్నారు. దీంతోపాటు మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతీ ఇంటికి కృష్ణ జలాలను ఇచ్చి రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చామని ఎంపీ వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారా అని నామా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వల్ల దేశంలో అల్లర్లు చెలరేగాయని నామా నాగేశ్వర్‌రావు విమర్శించారు. కేంద్రం మణిపూర్‌ ఘటనపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్, వంట గ్యాస్ ధరలను భారీగా పెంచిందని, దీంతో మధ్య తరగతి, పేద కుంటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు నామా నాగుశ్వర్‌రావు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు