Iran: యూరేనియం శుద్ధి మా హక్కు ..ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌లో శుద్ధి చేసిన యూరేనియం నిలువలు ఉన్నాయన్న అనుమానంతో ఇజ్రాయెల్‌, అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయమై ఇరాన్‌ అణు సంస్థ అధిపతి మహ్మద్‌ ఎస్లామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అని తేల్చి చెప్పారు.

New Update
FotoJet (13)

Iran uranium enrichment rights

Iran uranium enrichment rights : ఇరాన్‌ లో శుద్ధి చేసిన యూరేనియం నిలువలు ఉన్నాయన్న అనుమానంతోనే ఇజ్రాయెల్‌, అమెరికా ఇరాన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయమై ఇరాన్‌ అణు సంస్థ అధిపతి మహ్మద్‌ ఎస్లామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అంటూ ఆయన తేల్చి చెప్పారు. యూరేనియం శుద్ధి తమ హక్కు అని పేర్కొన్న ఆయన యూఎస్‌తో కాల్పుల విరమణ చర్చల్లో భాగంగా ఈ హక్కుకు రక్షణ అవసరమని చెప్పారు. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ స్మృత్యర్థం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గురువారం ఎస్లామీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 కానీ ఈ హక్కు గురించి ఎవరూ మాట్లాడట్లేదని కూడా ఆయన అన్నారు. కాగా, ఇరాన్‌తో చర్చల్లో ఈ అంశాన్ని చేర్చేందుకు యూఎస్ విముఖత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ వారాంతంలో యూఎస్, ఇరాన్‌లు ఇస్లామాబాద్ వేదికగా కాల్పుల విరమణపై చర్చించనున్న నేపథ్యంలో ఎస్లామీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూఎస్‌తో చర్చల్లో భాగంగా తమ హక్కులకు రక్షణ అవసరమని ఎస్లామీ అభిప్రాయపడ్డారు.

కాగా, రెండు దేశాలు సీజ్‌ ఫైరింగ్‌కు అంగీకరించినప్పటికీ ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చర్చలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అంతేకాదు, చర్చలు విఫలమైతే దీర్ఘ కాలిక యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్‌ తేల్చి చెప్పడం సంచలనంగా మారింది. హర్మూజ్‌ తెరవకపోతే మళ్లీ దాడులుచేస్తామంటూ ఇప్పటికే ట్రంప్‌ వార్నింగ్‌ ఇస్తే..దీర్ఘకాలిక యుద్ధానికి సై అంటూ ఇరాన్ తొడగొట్టడంతో ప్రపంచ దేశాల పరిస్థితిలో అయోమయం నెలకొంది.

ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ నేపథ్యంలో.. నెలన్నర రోజుల యుద్ధంలో తమదే విజయమంటే..తమదే అని రెండు దేశాలు ఎవరికి వారు ప్రకటించుకుంటున్నాయి. కాల్పుల విరమణ కోసం ఇరానే కాళ్ల భేరానికి వచ్చిందని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశంపై తాము తలపెట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించిందని ఆయన  చెప్పుకున్నారు. తమ దాడుల ధాటికి ఇరాన్‌ సైన్యం  మరికొన్నేళ్లదాకా కోలుకోలేనంతగా దెబ్బ తిన్నదని చెప్పారు. అయితే అమెరికానే కాళ్లబేరానికి దిగొచ్చి తాము విధించిన 10 షరతులకు అంగీకరించిందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ పేర్కొన్నాడం గమనార్హం. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పలు పోస్టులు చేశారు.

Advertisment
తాజా కథనాలు