/rtv/media/media_files/2026/05/24/china-coal-mine-explosion-2026-05-24-06-53-25.jpg)
China Coal Mine Explosion
China Coal Mine Explosion : చైనాలోని షాన్షీ (షాంగ్జీ) ప్రావిన్సులో గల ఒక బొగ్గు గనిలో ఘోర ప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం లియుషెన్యు బొగ్గుగనిలో అకస్మాత్తుగా గ్యాస్ లీకేజీ కావడంతో భారీ పేలుడు సంభవించింది. టాంగ్జో గ్రూపునకు చెందిన ఈ గనిలో రాత్రి 7:29 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మొత్తం 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం.
ఈ భయంకరమైన పేలుడు ధాటికి భారీ సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ప్రమాదంలో 82 నుండి 90 మంది వరకు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గని లోపల చిక్కుకుపోయిన వారి కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించి, ఇప్పటివరకు దాదాపు 150 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ ఘోర ప్రమాదంపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కోసం సమగ్ర సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులందరికీ తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ గ్యాస్ లీకేజీ పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిర్లక్ష్యానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. చైనాలో షాన్షీ ప్రావిన్సును బొగ్గుగనుల కేంద్రంగా పరిగణిస్తారు, అయితే సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇక్కడి గనుల్లో తరచూ ఇలాంటి భారీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రధాని మోదీ సంతాపం:
చైనా బొగ్గు గని ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు, చైనా ప్రజలకు,అధ్యక్షుడు షీ జిన్పింగ్కు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.
Follow Us