POK : ఈ నలుగురిని పట్టిస్తే కోటి రూపాయిలు..  పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన!

POKలో గత వారం నిషేధించబడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి చెందిన నలుగురు ముఖ్య నాయకులను పట్టుకోవడానికి అక్కడి ప్రభుత్వం కోటి పాకిస్తానీ రూపాయల భారీ బహుమతిని ప్రకటించింది.

New Update
pok

POKలో గత వారం నిషేధించబడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి చెందిన నలుగురు ముఖ్య నాయకులను పట్టుకోవడానికి అక్కడి ప్రభుత్వం కోటి పాకిస్తానీ రూపాయల భారీ బహుమతిని ప్రకటించింది. ఆ నలుగురు నాయకులు శౌకత్ నవాజ్ మీర్, ఉమర్ నజీర్ కాశ్మీరీ, ఖవాజా మెహ్రాన్ అర్షద్, సర్దార్ అమన్ ఖాన్. నిషేధిత జేఏఏసీ సంస్థకు చెందిన ఈ నేరస్థుల అరెస్టుకు దారితీసే సమాచారాన్ని అందించిన వారికి కోటి రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను చాలా రహస్యంగా ఉంచుతామని ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రెసిడెంట్ కార్యాలయం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన క్రూరమైన దాడి తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ దాడుల వల్ల అక్కడ ఇప్పటివరకు 100 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, కనీసం 400 మంది గాయపడ్డారు. వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. జూలై 27న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే, శరణార్థుల కోసం 45 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జేఏఏసీ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. 

సీట్ల రిజర్వేషన్లే కాకుండా

ఈ నిరసన సభ జరగడానికి ఒక రోజు ముందు నుండే అక్కడ ఘర్షణలు మొదలయ్యాయి. కేవలం సీట్ల రిజర్వేషన్లే కాకుండా.. అక్కడ జరుగుతున్న హింస, ఇంటర్నెట్ బంద్, విద్యుత్ కొరత, పెరిగిన ధరలు, నిరుద్యోగం, రాజకీయంగా తమను తొక్కేస్తున్నారనే విషయాలపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో జేఏఏసీని గత వారమే ప్రభుత్వం నిషేధించగా, తమను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం అణచివేత చర్యేనని ఆ గ్రూప్ సభ్యులు మండిపడుతున్నారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ చేస్తున్న ఈ అన్యాయాలపై అంతర్జాతీయ సమాజం స్పందించి, వారిని బాధ్యులను చేయాలని న్యూఢిల్లీ కోరింది. పాకిస్తాన్ చేస్తున్న తప్పులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం వారిని నిలదీస్తుందని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.

మరోవైపు పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేఏఏసీ సంస్థను నిషేధించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సముదాయాలపై విపరీతంగా బలాన్ని ప్రయోగించడం, ప్రజలు, రక్షక భటులు ప్రాణాలు కోల్పోవడం, ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేయడాన్ని హెచ్‌ఆర్‌సీపీ తీవ్రంగా తప్పుపట్టింది. సమస్యల పరిష్కారానికి చర్చలు చాలా అవసరమని, కానీ ఆ ప్రాంత ప్రజల రాజకీయ హక్కులను కాలరాస్తూ చర్చలు జరపడం సాధ్యం కాదని పేర్కొంది. ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పించాలని, వారి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలని డిమాండ్ చేసింది.

Advertisment
తాజా కథనాలు