కాళేశ్వరం లెక్కలు తేలాల్సిందే.. శ్వేతపత్రం విడుదల చేయండి: బీజేపీ ఎమ్మెల్యే

New Update
కాళేశ్వరం లెక్కలు తేలాల్సిందే.. శ్వేతపత్రం విడుదల చేయండి: బీజేపీ ఎమ్మెల్యే

కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్ధిపేటలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పు తీరిపోయిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత అప్పు తెచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ విధంగా అప్పు తీర్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం లెక్కలు తేలాల్సిందేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణకు 3.6 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారని, వాటిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పు ఉన్నట్లా? లేనట్లా? అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు తప్పుడు అఫిడవిట్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

పాలమూరు జిల్లాలో మంత్రి కూడా ఎన్నికల ఖర్చు తప్పుగా నమోదు చేసినట్లు కోర్టులో కేసు ఉందని, పాత కరీంనగర్ కు చెందిన ఎమ్మెల్యే, జహీరాబాద్ కు చెందిన ఎంపీలు ఎన్నికల కేసులు ఎదుర్కొంటున్నారని, వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి వారితో రాజీనామాలు చేయించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, పత్తి శ్రీనివాస్, ఉపేంద్ర రావు, మల్లేశం యాదవ్, అంబటి బాలేష్ గౌడ్, విబీషన్ రెడ్డి, రమేష్ గౌడ్, వేణుగోపాల్ అరుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు అండగా ఉంటున్నానని తెలిపారు. ఐఐటీ కాన్పూర్ లో సీటు సంపాదించిన దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి గ్రామానికి చెందిన చింతల మానసకు రూ.లక్ష విలువైన ల్యాప్ టాప్ ను ఉచితంగా అందజేసినట్లు ఎమ్మెల్యే రఘునందన్ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు