కాన్పూర్ లంబోర్గిని యాక్సిడెంట్.. టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా అరెస్ట్!

ఓవర్ స్పీడ్‌తో ఓ లంబోర్గిని కారు దూసుకొచ్చి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. టొబాకో బిజినెస్ మ్యాన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
Shivam Mishra arrest

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గత ఆదివారం ఓవర్ స్పీడ్‌తో ఓ లంబోర్గిని కారు దూసుకొచ్చి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. టొబాకో బిజినెస్ మ్యాన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లగ్జరీ కారు హై స్పీడ్‌ కారణంగా ఆరుగురు గాయాలపాలయ్యారు. యాక్సిడెంట్ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరగడం గమనార్హం.

ప్రమాదం జరిగిన నాటి నుండి పరారీలో ఉన్న శివం మిశ్రా కోసం కాన్పూర్ పోలీసులు ఐదు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. నిందితుడు కాన్పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకుంది. తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆదివారం నుండి అనేక హైడ్రామాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు శివం మిశ్రా నడపలేదని, తమ డ్రైవర్ మోహన్ యాదవ్ నడిపారని శివం తండ్రి కేకే మిశ్రా వాదిస్తూ వచ్చారు. డ్రైవర్ మోహన్ కూడా పోలీసుల వద్దకు వచ్చి తానే కారు నడిపానని నేరాన్ని అంగీకరించాడు. దీనికి మద్దతుగా శివం లాయర్ కోర్టులో అఫిడవిట్ కూడా సమర్పించారు.

డ్రైవర్ నేరాన్ని ఒప్పుకున్నప్పటికీ, పోలీసులు అతడి మాటలను నమ్మలేదు. దర్యాప్తు చేపట్టిన అధికారులకు CCTV ఫుటేజ్ రూపంలో కీలక ఎవిడెన్స్ లభించింది. ప్రమాదం జరిగిన సమయంలో స్టీరింగ్ సీటులో శివం మిశ్రా ఉన్నట్లు కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయిందని పోలీసులు వెల్లడించారు. "డ్రైవర్ లేదా నిందితుడి కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారనేది మాకు అనవసరం. సీసీటీవీ దృశ్యాల ప్రకారం శివమే కారు నడిపినట్లు తేలింది, అందుకే అతడిని అరెస్ట్ చేశాం" అని కాన్పూర్ డీసీపీ స్పష్టం చేశారు. గత ఆదివారం మధ్యాహ్నం కాన్పూర్‌లోని ఝూలా పార్క్ దగ్గర ఓవర్ స్పీడ్‌తో వచ్చిన లంబోర్గిని కారు అదుపుతప్పి ఆటోరిక్షాను, బుల్లెట్ బైకును ఢీకొట్టింది. చివరకు ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లగ్జరీ కారు నుజ్జునుజ్జవ్వడం, నిందితుడు ప్రముఖ బిజినెస్ మాన్ కొడుకు కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Advertisment
తాజా కథనాలు