/rtv/media/media_files/2026/05/24/punjab-2026-05-24-19-00-31.jpg)
గ్వాలియర్కు చెందిన నూతన వధువు, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ పాలక్ రజక్ అనుమానాస్పద ఆత్మహత్య కేసు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వరకట్న వేధింపుల వల్లే పాలక్ చనిపోయిందంటూ ఆమె పుట్టింటి వారు చేస్తున్న ఆరోపణలను భర్త కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే పాలక్పై వారు పలు సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పాలక్ భర్త అమిత్ రజక్ మాట్లాడుతూ.. పాలక్కు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా వేరే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. నిజానిజాలు తేలాలంటే ఆమె మొబైల్ ఫోన్ను పరీక్షించాలని కోరారు. గతంలో కూడా ఆమె ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించిందని, ఆ విషయాన్ని తాను ఆమె తండ్రికి కూడా చెప్పానని, ఇప్పుడు తమ కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికించారని అమిత్ పేర్కొన్నారు.
పాలక్ ఆడపడుచు లతా కూడా ఇవే ఆరోపణలను చేశారు. పాలక్ మద్యం తాగేదని, గంజాయి తాగేదని, తెలియని మగవాళ్లతో తిరిగేదని ఆరోపించారు. గతంలో పుట్టింట్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పారు. తన దగ్గర కొన్ని అసభ్యకరమైన వీడియోలు కూడా ఉన్నాయని లతా క్లెయిమ్ చేశారు.
మరోవైపు పాలక్ కుటుంబ సభ్యులు మాత్రం భర్త తరపు వారిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పెళ్లి తర్వాత కారు కావాలంటూ పాలక్ను అదనపు కట్నం కోసం వేధించారని, ఆ మానసిక వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని వాపోతున్నారు. గ్వాలియర్లోని మురార్ ప్రాంతానికి చెందిన పాలక్, మే 12న తన అత్తగారింట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. ఆమె తల్లిగారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త అమిత్, అత్త మీరా, బావ ఆకాష్లపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అతుల్ సోని ఈ కేసు గురించి మాట్లాడుతూ.. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశామని, భర్త అమిత్ను అరెస్ట్ చేశామని చెప్పారు. మిగిలిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం వెతుకుతున్నామని తెలిపారు. అసలు పాలక్ మరణానికి వరకట్న వేధింపులే కారణమా? లేక అత్తగారిళ్లు చెబుతున్న ఆరోపణల్లో ఏమైనా నిజముందా? అనే విషయాలపై పోలీసులు ఇంకా ఒక స్పష్టతకు రాలేదు, దర్యాప్తు కొనసాగుతోంది.
పాలక్ మరణించిన మే 12 నాడే.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్విషా శర్మ (33) అనే మహిళ కూడా భోపాల్లోని తన అత్తగారింట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించింది. నోయిడాకు చెందిన ట్విషాకు పెళ్లయి కేవలం ఐదు నెలలే అయింది. ఆమె కుటుంబం కూడా భర్త, అత్తమామలపై వరకట్న వేధింపులు, శారీరక, మానసిక హింస ఆరోపణలు చేసింది. మొదటి పోస్ట్మార్టం నివేదికపై అనుమానాలు వ్యక్తమవడంతో ఆమె కుటుంబం రెండోసారి పోస్ట్మార్టం చేయాలని కోరడం గమనార్హం. ప్రస్తుతం ఈ రెండు కేసులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Follow Us