సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ దాడి ఘటనలో ఇంకా ఎవరినీ పట్టుకోలేదని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్కువచ్చిన వ్యక్తికి.. సైఫ్ అలీఖాన్ కేసుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నిందితుడి కోసం గాలింపు జరుగుతుందని వెల్లడించారు.
అరెస్ట్ చేసిన వ్యక్తిని కేవలం ప్రశ్నించి వదిలేశాం. సైఫ్ కేసులో ఇప్పటివరకూ ఎవరిని అరెస్టు చేయలేదు. నిందితుడు చివరగా బాంద్రా రైల్వే స్టేషన్లో కనిపించాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దాడి తర్వాత లోకల్ ట్రైన్లో వసాయ్ విరార్ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నాం అని ముంబై పోలీసులు పేర్కొన్నారు.
Also Read: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!
10 ప్రత్యేక బృందాలతో గాలింపు..
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై దాడి ఘటన బాలీవుడ్ను ఒక్కసారిగా కలవరపరిచింది. ఈ సంఘటన ముంబైతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో, ముంబై పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా తీసుకున్నారు. దర్యాప్తు పర్యవేక్షణను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ చేపట్టడం విశేషం. నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టుతున్నారు.
ఆరోగ్యం మెరుగుపడుతోంది..
సైఫ్ అలీఖాన్ హెల్త్ పై డాక్టర్లు అప్డేట్ ఇచ్చారు.' ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం మాట్లాడగలుగుతున్నారు, అలాగే నడవగలుగుతున్నారు. నడుస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి లేదా ఇతర ఇబ్బందులు ఇప్పటివరకు కనిపించలేదు.
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్
త్వరలోనే ఆయన్ని ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెన్నెముక వద్ద కూరుకుపోయిన కత్తిని విజయవంతంగా తొలగించాం. అయితే గాయాల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున, ఆయనకు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి అవసరమని సూచించాం. మరికొన్ని రోజుల పాటు పరిస్థితిని పర్యవేక్షించి, డిశ్చార్జ్ చేస్తాం..' అని పేరొన్నారు.