అక్షర యజ్ఞానికి మెగాస్టార్ శ్రీకారం.. పేద విద్యార్థులకు ఉచిత విద్య!

మెగాస్టార్ చిరంజీవి మరో బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. రక్తం ఇచ్చి ప్రాణాలను కాపాడిన ఆయన, ఇప్పుడు అక్షరం అందించి పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రకటించిన ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

New Update
meghastar

వెండితెరపై ఆయన ‘అందరివాడు’.. కానీ నిజజీవితంలో ఆయన కొన్ని లక్షల కుటుంబాల పాలిట ‘ప్రాణదాత’. దశాబ్దాలుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సామాన్యులకు అండగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు మరో బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. రక్తం ఇచ్చి ప్రాణాలను కాపాడిన ఆయన, ఇప్పుడు అక్షరం అందించి పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆయన ప్రకటించిన ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఇటీవల ఒక ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆంతర్యాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. "నేను రక్తదానాన్ని ఉద్యమంలా చేపట్టినప్పుడు, నన్ను స్ఫూర్తిగా తీసుకుని తమిళ నటుడు సూర్య ‘అగరం ఫౌండేషన్’ను స్థాపించారు. దాని ద్వారా ఆయన ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఇప్పుడు అదే సూర్య నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన చేస్తున్న అద్భుతమైన పనిని చూసి, నేను కూడా పేద ప్రజలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాను," అని చిరంజీవి తెలిపారు.

ఒక తరం తలరాతను మార్చే ప్రయత్నం

చిరంజీవి దృష్టిలో విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానం కాదు, అది ఒక తరం భవిష్యత్తును మార్చే శక్తి. "రక్తదానం ప్రాణాలను కాపాడుతుంది, కానీ విద్య ఒక కుటుంబం మొత్తాన్ని పేదరికం నుండి విముక్తి చేస్తుంది" అని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అవసరముంటే అక్కడ అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ విద్యా సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది? అర్హులైన విద్యార్థులను ఎలా ఎంపిక చేస్తారు? వంటి అంశాలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. తమిళనాడులో ‘అగరం’ ఏ విధంగా అయితే వేలాది మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిందో, అదే తరహాలో మెగాస్టార్ ప్రారంభించబోయే ఈ సంస్థ కూడా ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, విధివిధానాలను మెగాస్టార్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

సమాజ హితం కోసం చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అటు సినీ ప్రముఖులు, ఇటు సామాన్య ప్రజలు మెగాస్టార్ సంకల్పాన్ని కొనియాడుతున్నారు. చిరంజీవి అక్షర సైనికుడిగా మారి పేదరికంపై చేయబోయే ఈ పోరాటం దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు