/rtv/media/media_files/2026/03/10/lavanya-tripathi-2026-03-10-14-31-30.png)
హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనను అసభ్యకరమైన, అవమానకరమైన పోస్టులతో వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇన్స్టాగ్రామ్లో “పర్పుల్ క్రేయాన్00” అనే అకౌంట్ నుంచి లావణ్యకు అశ్లీల వీడియోలతో పాటుగా అసభ్యకరమైన సందేశాలు పంపించాడో ఆగంతకుడు.
హద్దులు దాటడంతోనే
గత కొంతకాలంగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని, ఇప్పుడు అవి హద్దులు దాటడంతోనే తాను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. దీంతో ఈ వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేశారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు ఐపీసీ సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేశారు. అసలు ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి ఇవన్నీ చేస్తున్నారు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూస్తూ ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కూడా కోరుతున్నారు.
వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా
కాగా హీరో వరుణ్ తేజ్ను వివాహం చేసుకున్న తర్వాత లావణ్య తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇటీవలే ఆమె తల్లయ్యారు కూడా. బాబు పుట్టిన తర్వాత కొంతకాలంగా సినిమాలకు, బయటి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్న లావణ్యకు, ఈ ఆన్లైన్ వేధింపులు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి. కాగా తెలుగులో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, శ్రీరస్తు శుభమస్తు, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలలో నటించింది. సతీ లీలావతి చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
Follow Us