కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. నాలుగో విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 'ఒకే దేశం.. ఒకే ఆర్ఆర్బీ' ప్రణాళికను త్వరలో అమలులోకి తీసుకురాబోతుంది. దీని వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి, ఒక్కో రాష్ట్రంలో సింగిల్ గ్రామీణ బ్యాంక్గా మార్చేయనున్నారు. దీంతో, దేశంలో ప్రస్తుతం ఉన్న 43 ఆర్ఆర్బీల సంఖ్య 28కి తగ్గనుంది. 2025 మే 1 నుంచి ఈ నాలుగో విడత బ్యాంకుల ఏకీకరణ అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Also Read: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో 4, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో తలో 3, బిహార్, గుజరాత్, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో తలో 2 RRB లు ఏకీకరణ కానున్నాయి. ఈ ప్రక్రియ తర్వాత, ఆయా రాష్ట్రాల్లో ఒక్కో గ్రామీణ బ్యాంక్ మాత్రమే ఉండనుందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లు ఏకీకరణ అనంతరం 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్'గా మారనున్నాయి. మిగతా బ్యాంకుల పేర్లు కనిపించవు. ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంక్గా వ్యవహరిస్తుంది. అదే విధంగా, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోనూ ఒక్కో ఆర్ఆర్బీ మాత్రమే ఉండబోతుంది.
Also Read: Instagram: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు
ఈ ఏకీకరణ ద్వారా ప్రజా ప్రయోజనాలు, గ్రామీణ బ్యాంకుల ప్రయోజనాల దృష్ట్యా రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్, 1976ను అనుసరించి ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 43 ఆర్ఆర్బీలు 21,856 శాఖలతో 26 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ బ్యాంకులు 28.3 కోట్ల మంది డిపాజిటర్లు, 2.6 కోట్ల మంది రుణగ్రహీతలకు రుణాలు అందజేస్తున్నాయి. ఏకీకరణతో, ఈ బ్యాంకులు మరింత బలమైన, సమర్థవంతమైన సంస్థలుగా మారి, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను మెరుగుపరుస్తాయని అధికారులు అనుకుంటున్నారు.
చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారికి రుణాలు అందించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ బ్యాంకుల లక్ష్యం. ఒకప్పుడు దేశంలో 196 ఆర్ఆర్బీలు ఉండగా, 2004-05 నుంచి 2020-21 వరకు మూడు దశల్లో జరిగిన ఏకీకరణల వల్ల ఆ సంఖ్య 43కు తగ్గింది. ప్రస్తుతం చేపడుతున్న నాలుగో దశ ఏకీకరణతో ఈ సంఖ్య 28కి చేరనుంది. ఆర్ఆర్బీల్లో కేంద్ర ప్రభుత్వం 50 శాతం, స్పాన్సర్ బ్యాంక్ 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది, నాబార్డ్ పర్యవేక్షిస్తుంది.
ఆర్ఆర్బీలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, MGNREGA కార్మికుల వేతనాల చెల్లింపు, పెన్షన్ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అంతేకాకుండా, లాకర్ సౌకర్యాలు, డెబిట్-క్రెడిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI సేవలను కూడా అందిస్తాయి. ఏకీకరణతో, ఈ సేవలు మరింత సమర్థవంతంగా, విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది
Also Read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
banks | merge | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates