మణిపూర్‌ అంశంపై అధినాయకత్వానికి కట్టుబడి ఉంటా

కేంద్ర కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో గ్రామ దేవత గంగమ్మకు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆమె.. అధినాయకత్వానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు

New Update
మణిపూర్‌ అంశంపై అధినాయకత్వానికి కట్టుబడి ఉంటా

మణిపూర్‌లో (Manipur) మహిళలను నగ్నంగా ఊరేగించిన అంశంపై తాను అధినాయకత్వానికి కట్టుబడి ఉంటానని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ (Bharti Praveen) అన్నారు. ఆదివారం శ్రీవారి దర్శనం కోసం తిరుపతి (Tirupati) వచ్చిన ఆమె.. ముందుగా తిరుపతిలోని గ్రామ దేవత గంగమ్మ(Gangamma)కు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాల వల్ల ప్రజలకు అంటువ్యాధులు, విష జ్వరాలు సోకకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రాల్లో గ్రామ స్థాయి నుంచి నగరపాలక సంస్థ వరకు పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఇటీవల మణిపూర్‌(Manipur)లో దళిత వర్గానికి చెందిన ముగ్గురు మహిళలను ఇతర వర్గాలకు చెందిన యువకులు నగ్నంగా ఊరేగించిన ఘటన వెలుగులోకి రావడంతో ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో మణిపూర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌(Biren Singh)పై విపక్ష పార్టీలకు చెందిన నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్‌లో మహిళలకు భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకారులను అదుపు చేయలేకపోతోందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణమైపోయాయన్నారు. పోలీసులు 144 సెక్షన్‌ విధించినా అక్కడి ప్రజలు అవేమీ పట్టించుకోకుండా హింసకు పాల్పడుతోన్నారన్నారు.

మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా అల్లర్లు కొనసాగుతొన్నాయి. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని మైతీ తెగ (Maiti tribe) ఆందోళనకు దిగగా.. దీనికి వ్యతిరేకంగా కుకి తెగ (Kuki tribe) సైతం నిరసనలు చేపట్టింది. దీంతో మైతీ, కుకి తెగల మధ్య చెలరేగిన చిచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. అప్పటి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు, హింసాకాండ చెలరేగుతోంది. ఇరు జాతులకు చెందిన నేతలు పోటాపోటీగా నిరసనలు చేపడుతున్నారు. ఈ మారణ హోమంలో ఇప్పటి వరకు పలువురు మృతి చెందారు. పోలీసులు ఇరు తెగలకు చెందిన వారిని అదుపు చేయడంలో విఫలమవుతున్నారు. కాగా రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది మైతీ తెగ(Maiti tribe)కు చెందినవారు ఉన్నారు. ఈ తెగకు చెందిన వారిలో 60 మంది ఎమ్మెల్యేలుగా ఉండటం గమనార్హం.

మణిపూర్‌ అల్లర్లపై, మహిళలను నగ్నంగా ఊరేగింపు అంశంపై ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నోరు మెదపలేదు. దీనిపై చర్చ జరగాలని లోక్‌సభ(Lok Sabha)లో విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని వివరణ ఇవ్వాలని విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ప్రధాని దీనిపై స్పందించకపోవడంతో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని (Motion of no confidence) ప్రవేశపెట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు