CAA Explainer : ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం? ముస్లిం సమాజం సహా అనేక సంస్థలు సీఏఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ఈ సీఏఏను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంటే..అధికారపక్షం స్వాగతిస్తోంది. దీనిపై దేశ ప్రజల్లోనూ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

New Update
CAA Explainer : ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం? ముస్లిం సమాజం సహా అనేక సంస్థలు సీఏఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

CAA Explainer : పౌరసత్వ సవరణ చట్టం... ఇప్పుడు ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఈ అంశంపైన్నే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ సోమవారం సాయంత్రం కేంద్ర సర్కార్ నోటిఫై చేసింది. దీంతో నాలుగేండ్ల తర్వాత చట్టం వాస్తవరూపంలోకి వచ్చింది. మరి అసలు ఈ సీఏఏ(CAA) అంటే ఏమిటి? కొన్ని వర్గాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దీనిపై ఎందుకు వివాదం కొనసాగుతోంది? పార్లమెంట్ ఎన్నికల ముందే ఈ చట్టాన్ని ఎందుకు తెరపైకి తీసుకువచ్చారు? అప్పట్లో నిరసనలు ఎందుకు జరిగాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి?
పౌరసత్వ సవరణ బిల్లు.. సీఏఏని ప్రధాని మోదీ(PM Modi) నేత్రుత్వంలోని ఎన్డీఏ సర్కార్ 2019లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పాకిస్తాన్, అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారతదేశ పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారతదేశానికి వలస వచ్చినవారు దీనికి అర్హులు. ఈ అర్హత కేవలం హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్శీలు, బౌద్ధులకు మాత్రమే వర్తిస్తుంది. వీరంతా కూడా ఎలాంటి ధ్రువీకరణ ప్రతాలు లేకున్నా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.అంటే భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లీమేతర వర్గాలకు వారికి భారత పౌరసత్వం కల్పించేందుకు తీసుకువచ్చిందే ఈ సీఏఏ చట్టం.

సీఏఏను ముస్లిం సమాజం ఎందుకు వ్యతిరేకిస్తోంది?
సీఏఏను చట్టంగా ఆమోదించిన తర్వాత ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు, కొన్ని సంస్థలు అలజడి సృష్టించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.ఇప్పుడు సీఏఏ చట్టం అమలు తర్వాత.. ముస్లిం సమాజం,సంస్థలు మరోసారి వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా పలువురు ముస్లిం నేతలు దీనిని ఖండిస్తున్నారు. ఈ చట్టం నుంచి ముస్లింలను మినహాయించడం సరికాదని ముస్లిం సమాజం విశ్వసిస్తోంది. ఇది సమానత్వ హక్కుకు విరుద్ధమని... దేశ ఐక్యత, సమగ్రతకు హాని కలిగిస్తుందని పేర్కొంది.సీఏఏ సాకుతో ముస్లింలను వేధించవచ్చని కొన్ని ముస్లిం సంస్థలు చెబుతున్నాయి. దీనితో పాటు, అనేక ముస్లిం సంస్థలు సీఏఏను ఈశాన్య రాష్ట్రాల జనాభాను మార్చగలవని నమ్ముతున్నాయి.

పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) పరిధిలో ముస్లింలను చేర్చుకుండా ముస్లిమేతరలను ప్రస్తావించడం పట్ట ముస్లింలు భగ్గమంటున్నారు. సీఏఏను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత డిసెంబర్ 4, 2019లో అసోంలో ఆందోళన జరిగాయి. డిసెంబర్ 11వ తేదీన ఈ చట్టం ఆమోదం పొందిన అనంతరం.. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు తీవ్రమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

సీఏఏలో ముస్లింలను ఎందుకు చేర్చలేదు?
పౌరసత్వ సవరణ చట్టంపై హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పార్లమెంట్లో మాట్లాడారు. ఆప్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు ముస్లిం దేశాలు అన్నారు. అక్కడ మెజార్టీ ముస్లింలు మతం పేరుతో అణచివేతకు గురికారు. అయితే ఈ దేశాల్లో హిందువులతో సహా ఇతర వర్గాలకు చెందిన ప్రజలు మతం ఆధారంగా అణచివేతకు గురవుతున్నారు. అందుకే ఈ దేశాల ముస్లింలను పౌరసత్వ చట్టంలో చేర్చలేదని వివరణ ఇచ్చారు.

ఎవరు పౌరసత్వం పొందుతారు?
సీఏఏ చట్టం ప్రకారం.. డిసెంబర్ 31, 2014 వరకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు అణచివేతకు గురైన ముస్లిమేతర వలసదారులకు మోదీ ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంది. 2019 డిసెంబర్‌లో సీఏఏ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందడం గమనార్హం. అయితే, చట్టం ఇంకా అమలు కాలేదు. దాని అమలు కోసం నియమాలు అవసరం.ఈ చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా మనదేశంలోకి ప్రవేశించినా లేదా చెల్లుబాటు అయ్యే పత్రాలతో భారత్ కు వచ్చిన వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. కానీ నిర్ణీత కాలం కంటే ఎక్కువ కాలం ఇక్కడ ఉన్నవారే అర్హులే.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
పౌరసత్వం పొందే ప్రక్రియను ఆన్ లైన్లో ఉంచింది. దీనికి సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్ ను కూడా కేంద్ర హోంశాఖ సిద్ధం చేసింది. పౌరసత్వం పొందేందుకు దరఖాస్తుదారులు ఎలాంటి పత్రాలు లేకుండా భారత్ లోకి ప్రవేశించిన సంవత్సరాన్ని సూచించాలి. దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి పత్రం అడగరు. పౌరసత్వానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న కేసులన్నీ ఆన్ లైన్లోకి ట్రాన్స్ ఫర్ అవుతాయి. అర్హులైన వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ దరఖాస్తులను హోంశాఖ పరిశీలించి... దరఖాస్తు దారునికి పౌరసత్వం జారీ చేస్తుంది.

ఎన్నికలకు ముందే ఎందుకు ?
భారత్(India) కు వలస వచ్చిన ముస్లిమేతర వలసదారులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం దక్కుతుంది. ప్రక్రియ అంతా కూడా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది. 2019 డిసెంబర్ లో ఈ చట్టం ఆమోదం పొందింది.ఈ చట్టానికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ ఇంతవరకు దీనిపై నిబంధనలు రూపొందించలేదు. దీంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. తాజాగా కేంద్రం నోటిఫై చేసింది.

కాగా ఈ చట్టం నుంచి భారత్ లోని ముస్లింల పౌరసత్వానికి లేదా మతానికి, వర్గానికి చెందిన వ్యక్తులకు ఎలాంటి ముప్పు ఉండదు. ఇంతకు ముందు శ్రీలం నుంచి వలసవచ్చిన తమిళులకు, బర్మా, ఉగాండ నుంచి వచ్చిన వారికి కూడా గతంలో భారత పౌరసత్వం కల్పించారు.

ఇది కూడా చదవండి : సీఏఏను మా రాష్ట్రంలో అమలు చేయం..ఇప్పుడే ఎందుకు చేస్తున్నట్లు..?

Advertisment
Advertisment
తాజా కథనాలు