/rtv/media/media_files/2025/01/20/7296hqy5T53BOUW2zJhN.jpg)
Addanki Dayakar
అద్దంకి దయాకర్.. తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు చాలా పాపులర్. సామాజిక ఉద్యమాల నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నేత.. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి బలమైన గొంతుగా మారారు. వేలాది టీవీ చర్చలు, ప్రెస్ మీట్ల ద్వారా పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషిని ఆయనను వ్యతిరేకించేవారు సైతం కాదనలేరు. 2014, 18 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దయాకర్.. ఈ రెండు సార్లు కూడా కేవలం రెండు వేల తేడాతోనే ఓటమి పాలయ్యారు. అయితే.. గత ఎన్నికల్లో పార్టీలో వర్గ విభేదాల కారణంగా ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా ఆయన ఏ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయకుండా పార్టీ గెలుపు కోసం పని చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దయాకర్ కు సముచిత స్థానం కల్పిస్తామని అగ్రనేతలు ఆ సమయంలో హామీ ఇచ్చారు.
ఏడాది దాటినా దక్కని పదవి..
పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత దయాకర్ కు కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు. మంత్రి పదవి కూడా ఇచ్చి.. విద్యాశాఖను కూడా కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బల్మూర్ వెంకట్ కు ఎమ్మెల్సీ ఇచ్చిన సమయంలో దయాకర్ పేరు సైతం ఖారారైందన్న వార్తలు వినిపించాయి. కానీ ఆఖరి నిమిషంలో ఆయనకు బదులుగా మహేశ్ కుమార్ గౌడ్ కు అవకాశం దక్కింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ అద్దంకికి వరంగల్ ఎంపీగా అవకాశం వస్తుందంటూ మీడియా కోడై కూసింది. కానీ.. ఆ ఛాన్స్ కూడా దక్కలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అద్దంకికి ఎలాంటి పదవి రాకపోవడంతో ఆయన వర్గీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అద్దంకి పేరును కాంగ్రెస్ మరిచిపోయిందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.
ఒకే రోజు ఇద్దరు కీలక నేతలతో భేటీ!
అయితే.. ఈ రోజు కొద్ది గంటల వ్యవధితోనే అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బలమైన కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తుంగతుర్తి నియోజకవర్గంలో బలమైన అనుచరగణం కలిగిన దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తో దయాకర్ కు గతంలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరే దయాకర్ కు టికెట్ దక్కకుండా అడ్డుపడ్డారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు దయాకర్ కు ఏ అవకాశం రాకుండా వీరే చక్రం తిప్పుతున్నారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఉంది. దీంతో వీరితో సయోధ్య కుదుర్చుకునేందుకు దయాకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దామోదర్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డిని కలిసినట్లు చర్చ సాగుతోంది.
మళ్లీ తుంగతుర్తిలోకి ఎంట్రీ?
ప్రస్తుతం తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్న మందుల సామేల్ కు, దామోదర్ రెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. తుంగతుర్తి నియోజకవర్గంతో తన కుమారుడు సర్వోత్తమ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజదర్బార్ నిర్వహిస్తామని దామోదర్ రెడ్డి గతంలో సంచలన ప్రకటన చేశారు. సామేలుకు వ్యతిరేక వర్గం తలపెట్టిన మీటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలనే అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు తరలించడం సంచలనంగా మారింది. కొన్ని రోజులుగా సామేలు ప్రవర్తన కోమటిరెడ్డి బ్రదర్స్ కు కూడా మింగుడు పడడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సామేలుకు చెక్ పెట్టేందుకు మళ్లీ దయాకర్ ను తెరపైకి తెచ్చారా? అన్న విశ్లేషణలు సైతం నల్లగొండ పాలిటిక్స్ లో వినిపిస్తున్నాయి.
కేవలం సయోధ్య కోసమే దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దయాకర్ కలిశారా? లేక తుంగతుర్తి పాలిటిక్స్ లో మళ్లీ ఎంట్రీ ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే సామేలుకు ఝులక్ ఇస్తారా? అన్న అంశంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.