/rtv/media/media_files/2026/06/01/cid-2026-06-01-16-52-56.jpg)
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డాఫాబెట్ ద్వారా దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర ముఠాను తెలంగాణ CID అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా 11 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా.. వారి వద్ద నుండి 3 లగ్జరీ కార్లు, 8 ల్యాప్టాప్లు, 2 ఐప్యాడ్లు, 26 మొబైల్ ఫోన్లు, 5 పాస్పోర్టులు, రూ. 3.21 లక్షల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్కు చెందిన ఓ బాధితుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ ద్వారా దాదాపు రూ. 9.95 లక్షలు నష్టపోయానని ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన SIT లోతుగా విచారణ జరిపి ఈ ముఠాను పట్టుకుంది.
సీఐడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా మాట్లాడుతూ.. ఈ ముఠా వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. అక్రమ బెట్టింగ్ సొమ్మును దారి మళ్లించడానికి వీరు వివిధ రాష్ట్రాల్లోని 46 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు దాదాపు 8 లేయర్ల ద్వారా ఈ డబ్బును రూట్ మార్చారు అని వెల్లడించారు.
అసలు రంగు బయటపెట్టి
ఈ ముఠా ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్, క్యాసినో గేమ్స్, ఏవియేటర్ ప్లాట్ఫామ్ల ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించింది. ఆరంభంలో భారీ బోనస్లు, సులభమైన లాభాలు, ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటూ బాధితులను ఆకర్షించేవారు. డబ్బును యూపీఐ, ఐడీలు, క్యూఆర్ కోడ్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వసూలు చేసేవారు. నమ్మకం కుదరడం కోసం మొదట్లో చిన్న చిన్న మొత్తాలను లాభాల రూపంలో బాధితుల ఖాతాల్లో వేసేవారు. అది నమ్మి బాధితులు పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేశాక, అసలు రంగు బయటపెట్టి ముంచేసేవారు. డీఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలోని సీఐడీ బృందాలు ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో దాదాపు రెండు వారాల పాటు సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించి, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఈ ముఠాపై ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలలో మొత్తం 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణలో ఇప్పటివరకు అక్రమ ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి 414 కేసులు నమోదైనట్లు సీఐడీ చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సమన్వయంతో ఇప్పటివరకు 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లను గుర్తించి బ్లాక్ చేశామని, మరో 37 బెట్టింగ్ ప్లాట్ఫామ్లపై జియో-ఫెన్సింగ్ చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు.
Follow Us