పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఆయన ఎలా చనిపోయారు అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రవీణ్ పోస్టుమార్టానికి సంబంధించి నివేదిక రానుంది. పోస్టుమార్టం రిపోర్టుతో మరింత సమాచారం వచ్చే ఛాన్స్ ఉంది. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ప్రవీణ్ విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే సమయంలో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చాగల్లులో రక్షణ సువార్త మహాసభలకు పాస్టర్ ప్రవీణ్ వెళ్లారు.
ప్రవీణ్-రామ్మోహన్ మధ్య సంబంధం ఏంటి?
మార్చి 26 నుంచి 28వరకు మహాసభల్లో ప్రవీణ్ ప్రసంగం ఉండేలా షెడ్యూల్ చేశారు. అయితే ఒక్కరోజు ముందుగానే మార్చి 24న ప్రవీణ్ చాగల్లు వెళ్లారు. షెడ్యూల్ కంటే ముందుగానే ఆయన వెళ్లడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమండ్రి సీటీఆర్ఐ చర్చి పాస్టర్ రామ్మోహన్తో ప్రవీణ్ కు పరిచయం ఉంది. ప్రవీణ్ కాల్ డేటాలో చివరి కాల్ రామ్మోహన్కు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రవీణ్, రామ్మోహన్ మధ్య సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రామ్మోహన్తో కలిసి ప్రవీణ్ 'యూత్ విత్ బైబిల్ మిషన్' నడిపినట్లు తెలుస్తోంది. బైబిల్ మిషన్ కాలేజీ వ్యవహారాల కోసం ప్రవీణ్ ముందుగా వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సువార్త మహాసభలకు ప్రవీణ్ పగడాలను ధర్మవరానికి చెందిన శామ్యూల్ ఆహ్వానించారు. మార్చి 24న ప్రవీణ్ మరణంతో క్రైస్తవ మహాసభలు నిలిచిపోయాయి. చివరి 3 రోజుల ప్రసంగం కోసం ప్రవీణ్ను ఆహ్వానించినట్లు పాస్టర్ శామ్యూల్ తెలిపారు.