BREAKING: డీజీపీ ముందు లొంగిపోయిన దేవుజి.. 40 మంది మావోయిస్టులు

డీజీపీ సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు కీలక అగ్రనేతలతో పాటు మొత్తం 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్న దేవుజి అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నారు.

New Update
Maoist Party Secretary

మావోయిస్ట్ అగ్రనేత దేవుజి అలియాస్ తిప్పరి తిరుపతి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సంచలన విషయాలను వెల్లడించారు. మావోయిస్టు పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బని, పార్టీలోని అత్యున్నత స్థాయి నేతలతో సహా పెద్ద సంఖ్యలో కేడర్ జనజీవన స్రవంతిలో చేరారని ఆయన ప్రకటించారు.

డీజీపీ సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు కీలక అగ్రనేతలతో పాటు మొత్తం 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్న దేవుజి అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నారు. నంబాల కేశవరావు తర్వాత ఈయన పార్టీ పగ్గాలు చేపట్టారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీలో కీలకమైన వ్యూహకర్తగా ఉన్న నున్నే నరసింహ రెడ్డి వారి వారి దళాలతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.  

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
ప్రస్తుత మావోయిస్టు పార్టీ సెక్రటరీ దేవుజి లొంగిపోవడం పార్టీ చరిత్రలోనే అతిపెద్ద పరిణామంగా పోలీసులు భావిస్తున్నారు. ఆరోగ్య కారణాలు, పార్టీ సిద్ధాంతాల పట్ల వైముఖ్యత, ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతో వీరంతా బయటకు వచ్చినట్లు డీజీపీ తెలిపారు. గత కొన్ని నెలలుగా తెలంగాణ పోలీసులు చేపట్టిన "రీసెట్" ఆపరేషన్, నిరంతర కౌన్సెలింగ్ ఫలితంగానే ఈ స్థాయి లొంగుబాటు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

డీజీపీ పిలుపు
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తామని, వారికి రావాల్సిన రివార్డు సొమ్మును కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. "హింస ద్వారా సాధించేదేమీ లేదని గుర్తించి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలి," అని డీజీపీ సూచించారు.

Advertisment
తాజా కథనాలు