Telangana First: కవిత కొత్త పార్టీ నినాదం ఇదే.. ‘తెలంగాణ ఫస్ట్’

తెలంగాణలో మరో 2 నెలల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కవిత తెలిపారు. ఈ పార్టీ నినాదం "తెలంగాణ ఫస్ట్" అని ఆమె స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో కోర్టు క్లీన్‌చీట్ ఇవ్వడంతో ఆమె ఫ్యామిలీతోపాటు అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.

New Update
_Telangana First

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు. ఆమె త్వరలోనే పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ గురించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి చేరుకున్న ఆమె, అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

'తెలంగాణ ఫస్ట్' నినాదం 

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరో 2 నెలల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కవిత తెలిపారు. ఈ పార్టీ నినాదం "తెలంగాణ ఫస్ట్" అని ఆమె స్పష్టం చేశారు. కుల, మత, వర్గ విభేదాలకు తావులేకుండా, కేవలం ప్రజల సేవయే ప్రాధాన్యతతో ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

లిక్కర్ స్కాంలో క్లీన్‌చీట్‌తో తిరుమల మొక్కు

గత నాలుగేళ్లుగా తాను, తన కుటుంబ సభ్యులు చేయని తప్పుకు ఎంతో మానసిక వేదన అనుభవించామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తనపై ఉన్న కేసులను పూర్తిగా కొట్టేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. "కేసుల నుంచి విముక్తి లభిస్తే కాలి నడకన తిరుమలకు వస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకోవడానికే ఇప్పుడు స్వామివారి దర్శనానికి వచ్చాను" అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా న్యాయం చేసిన న్యాయవ్యవస్థకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతిపక్షాల వైఫల్యంపై విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై కవిత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రజల సమస్యల పరిష్కారంలో, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా, మైక్రో లెవల్‌లో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే తమ లక్ష్యమని చెప్పారు. హైడ్రా పేద ప్రజలను ఇబ్బంది పెడుతోందని, ఇది కేవలం పెద్దవాళ్లకు మాత్రమే చుట్టంగా మారిందని మండిపడ్డారు. తాను ఎప్పుడూ పేదల పక్షానే పోరాడతానని హామీ ఇచ్చారు.

ఆంధ్ర ప్రజలపై స్పష్టత

రాజకీయాల్లో ప్రాంతీయ విభేదాల గురించి మాట్లాడుతూ, తమకు ఆంధ్ర ప్రజలపై ఎలాంటి ద్వేషం లేదని కవిత స్పష్టం చేశారు. తాము వ్యతిరేకించింది కేవలం రాజకీయ ఆధిపత్యాన్నే తప్ప, ప్రజలను కాదని ఆమె వివరించారు. కవిత తీసుకున్న ఈ కొత్త నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ సొంత పార్టీ పెడుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు