Jadcherla : జడ్చర్లలో దారుణం.. నిశ్చితార్థం జరిగిందని ప్రియురాలి గొంతు కోసాడు!

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందనే కక్షతో ఒక ప్రేమోన్మాది ఆమెను కత్తితో విచక్షణారహితంగా పొడిచి, గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.

New Update
jadcharla

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందనే కక్షతో ఒక ప్రేమోన్మాది ఆమెను కత్తితో విచక్షణారహితంగా పొడిచి, గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.

వివరాల్లోకి వెళ్తే..  జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావి గడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి అనే యువతిని, తేజ అనే యువకుడు గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే, ఇటీవల వైష్ణవికి వేరే ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తేజ తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు.

శనివారం వైష్ణవి ఇంటి సమీపంలోనే ఆమెపై తేజ ఒక్కసారిగా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆమె శరీరంపై విచక్షణారహితంగా పొడుస్తూ, చివరకు గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వైష్ణవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

స్తంభానికి కట్టేసి దేహశుద్ధి

యువతిపై దాడి జరుగుతుండటం గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే వైష్ణవి ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. పారిపోతున్న ఉన్మాది తేజను పట్టుకున్నారు. అతడిని తాళ్లతో స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైష్ణవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. స్థానికుల చేతిలో తీవ్రంగా గాయపడిన నిందితుడు తేజను పోలీసులు రక్షించి, చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘోర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పట్టపగలు నివాస ప్రాంతంలో జరిగిన ఈ హత్య స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

Advertisment
తాజా కథనాలు