IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్!
TG: భూదాన్ భూముల అక్రమాల కేసులో అమోయ్ కుమార్ రెండోరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. కాగా ఎర్రబెల్లితో అమోయ్ కుమార్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఉచ్చు ఎర్రబెల్లితో పాటు కేటీఆర్కు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది.
ED Investigation : ఈడీ విచారణకు రెండు రోజు హాజరయ్యారు రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ భయంలో మల్కాజ్ గిరి జిల్లాలో జరిగిన భూ కేటాయింపులలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఈడీ విచారిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలోని స్పెషల్ టీమ్ అమోయ్ కుమార్ను ఈ భూ కేటాయింపులలో జరిగిన అవకతవకలపై విచారిస్తోంది. కాగా మాజీ మంత్రి ఎర్రబెల్లితో అమోయ్ కుమార్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఉచ్చు చివరికి ఎర్రబెల్లితో పాటు కేటీఆర్ కు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.
ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు భూ కేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను అక్రమంగా బదిలీ చేసినట్లు సమాచారం. కాగా భూదాన్కు చెందిన సర్వే నంబర్ 181లో 50 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉండేది. ఈ భూమికి తమది అంటూ.. ఆ భూమికి వారసురాలిని తాను అంటూ గతంలో ఖాదురున్నీసా బేగం అనే ముస్లిం మహిళ సక్సేషన్కు దరఖాస్తు చేసుకుంది. కాగా ఈ భూమిని 2021లో ఆమె పేరున వివాదాస్పద భూమి రిజిస్టర్ చేశారు అధికారులు.
ఆ తర్వాత ఆ భూమి ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్కు అమ్మకం చేశారు. అయితే.. ఇందులో ఎదో అవకతవకలు, అక్రమం జరిగిందంటూ దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపి ప్రభుత్వం సొమ్ముకు గండి పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు...మహేశ్వరం పోలీసులకు కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో మహేశ్వరం మండల మాజీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆర్పీ జ్యోతితో పాటు ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ ఓనర్ కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
కాగా పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంలో తహసీల్దార్ సహా పెద్ద నేతల హస్తం ఉందని.. అలాగే కొందరు అధికారుల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. వారికి పెద్ద మొత్తంలో డబ్బు సంచులు అందినట్లు కనుక్కున్నారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు ఆధారంగా రంగంలోకి ఈడీ వచ్చింది. దీనిపై FIR నమోదు చేసింది. ఈ కేసులో కేసుల్లో పేర్కొన్న భూముల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. భూ కేటాయింపుల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, కేటాయింపుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు లాగేందుకు అమోయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
Bhu Bharati: ప్రతి అప్లికేషన్కు ఒక డెడ్లైన్.. 'భూ భారతి' చట్టం మార్గదర్శకాలివే!
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 'భూ భారతి' చట్టంలో ప్రతి అప్లికేషన్కు ఒక డెడ్ లైన్ విధించింది. భూ రికార్డుల్లో తప్పులు, వివరాలు లేకపోయినా ఏడాదిలోపు నిర్దేశించిన ఫీజు చెల్లించి సవరణలు కోరవచ్చు. మరికొన్నింటికి 30 నుంచి 90 రోజుల సమయం కేటాయించింది.
Bhu Bharati: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం 'భూ భారతి' చట్టం మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. చట్టం అమలును గెజిట్ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్మిత్తల్ జీవో నం: 36, 39లను జారీ చేశారు. అయితే ఈ పోర్టల్ ద్వారా చేసే ప్రతి అప్లికేషన్ కు గడువు విధించగా ఈ చట్టం అమల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏడాదిలోపు సవరణలు..
భూ రికార్డుల్లో తప్పులు, వివరాలు లేకపోయినా ఏడాదిలోపు నిర్దేశించిన ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా సవరణలు కోరవచ్చు. ఇందుకోసం పాసు బుక్, టైటిల్ డీడ్స్, పహాణీలు లేదా రిజిస్టర్ డాక్యుమెంట్లతోపాటు దరఖాస్తుకు సంబంధించిన అఫిడవిట్ సమర్పించాలి. ఆర్డీవోలు, జిల్లా కలెక్టర్లు ఈ దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఆర్డీవోల నిర్ణయంపై అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయొచ్చు. కలెక్టర్ల నిర్ణయాలపై అభ్యంతరాలుంటే ట్రిబ్యునల్స్కు రీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో సమస్య పరిష్కారానికి రెవెన్యూ వర్గాల నుంచి నోటీసు అందుతుంది. వీటిపై సెకండ్ పార్టీ వారం రోజుల్లోగా లిఖితపూర్వక అభ్యంతరాలు ఇవ్వాలి. లేదంటే సంబంధిత అధికారి చట్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ ఉత్తర్వులను భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉంచనుండగా నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపు ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
90 రోజుల్లోనే పూర్తి చేయాలి..
భూమి రిజిస్ట్రేషన్తోపాటు మ్యుటేషన్ చేసుకునేందుకు ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకునే వీలుంది. రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ స్లాట్ కేటాయిస్తారు. అనంతరం ఇరు పక్షాలు సంతకాలు చేసిన డాక్యుమెంట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ సమర్పించాలి. వీటి ఆధారంగా దరఖాస్తుదారుడు పేర్కొన్న వివరాలను పరిశీలించి అధికారి రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాగానే ఆ రికార్డును తహసీల్దార్ భూభారతిలోకి మారుస్తారు. పాసు బుక్ కూడా వెంటనే జారీ చేస్తారు. అలాగే ఇప్పటికే పెండింగ్లో ఉన్న 9 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులను క్లియర్ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండా తెల్ల కాగితాలపై భూ యాజమాన్య హక్కులను మార్చుకున్నా వాటిని కూడా ఈ చట్టం ప్రకారం పరిష్కరించుకునే అవకాశం కల్పించారు. అయితే ఆ భూమి సీలింగ్, షెడ్యూల్డు ఏరియా, అసైన్డ్ చట్టాల పరిధిలో ఉండకూడదు. సాదాబైనామా కింద దరఖాస్తుదారునికి హక్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే సర్టిఫికెట్ జారీ చేసి.. వారం రోజుల్లో ఇరుపక్షాలకు పంపిస్తారు. ఆ తర్వాత భూభారతి చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. అయితే ఇదంతా 90 రోజుల్లోనే పూర్తి చేయాలి.
నోటులసు అందిన 7 రోజుల్లోగా..
వీలునామా లేదా వారసత్వంగా వచ్చే భూమి హక్కుల కోసం భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వారసత్వ హక్కుల కోసం వారసులంతా అఫిడవిట్లు జత చేయాలి. అందరికీ తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు. గ్రామపంచాయతీ, తహసీల్దార్ ఆఫీసు నోటీసు బోర్డుల్లో వీటిని ప్రదర్శిస్తారు. నోటులసు అందిన 7 రోజుల్లోగా దరఖాస్తుదారుడు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి. తహసీల్దార్ వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం 30 రోజుల్లోగా జరగాలి. ఇక ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్, సీలింగ్, భూదాన్, 1977 అసైన్డ్ చట్టం కింద ఇచ్చిన భూములు భూ భారతిలో అప్లై చేసుకోవచ్చు. ఇనామ్ల రద్దు చట్టం కింద ఓఆర్సీ, రక్షిత కౌలుదారు చట్టం కింద యాజమాన్య సర్టిఫికెట్లు, ఇండ్ల స్థలాల రూపంలో ఇచ్చిన భూముల మ్యుటేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కోర్టు ఆదేశాలు, లోక్అదాలత్ తీర్పులు, రెవెన్యూ కోర్టుల ఉత్తర్వులకు సంబంధించి కూడా ఇందులో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా ఈ ప్రక్రియ కూడా 30 రోజుల్లో పూర్తి చేయాలి.
అప్పీల్లను 30 నుంచి 60 రోజుల్లోగా..
ఇక టైటిల్, కబ్జా, ఇతర సివిల్ అంశాల్లో ఎలాంటి అభ్యంతరాలున్నా సివిల్ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. తహసీల్దార్ల నిర్ణయాలపై ఆర్డీవోలకు, ఆర్డీవోల నిర్ణయాలపై కలెక్టర్లకు, కలెక్టర్ల నిర్ణయాలపై ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీల్లను 30 నుంచి 60 రోజుల్లోగా పరిష్కరించాలి. ఎవరైనా మోసపూరితంగా భూమిపై హక్కులు పొందారని భావిస్తే భూభారతి పోర్టల్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) సుమోటోగా అనుమానాస్పద భూములపై విచారణ చేపట్టవచ్చు. రికార్డులు, డాక్యుమెంట్లు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం సదరు భూమిని వెనక్కు తీసుకునే వెసులుబాటును కల్పిస్తోంది ఈ చట్టం.
భూభారతి పోర్టల్ నిర్వహణ CCLA ఆదీనంలో ఉంటుంది. రికార్డుల తయారీ, వాటి నిర్వహణ, అప్డేషన్ లో సమయానుకులంగా మార్పు చేర్పులుంటాయి. ప్రభుత్వ అనుమతితోనే షెడ్యూళ్ల మార్పు,ఆదేశాల జారీ, మార్గదర్శకాల రూపకల్పన అన్నీ CCLA పరిధిలోనే జరుగుతాయి. పేద రైతులకు ఈ చట్టం ద్వారా ఉచిత న్యాయ సాయం అందుతుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు మండల, జిల్లా లీగల్ అథారిటీల సహకారంతో ఈ సాయం అందించనున్నారు. భూభారతి పోర్టల్లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు తాత్కాలిక భూదార్ కార్డులు జారీ చేస్తారు. పోర్టల్లో పేరు నమోదైన ప్రతి ఒక్కరికీ ఈ కార్డులు జారీ చేస్తారు. రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసి, ప్రతి భూమికి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా హద్దులు నిర్ణయించి ఈ కార్డులను జారీ చేస్తారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు భవిష్యత్తులో ప్రతి భూమికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (UIN) ఇస్తారు.
భూ యజమానులు కొత్త పాసు బుక్ ల కోసం ఈ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలించి హక్కుల రికార్డులోని వివరాల ఆధారంగా పాసుపుస్తకం కమ్ టైటిల్ డీడ్ జారీ చేస్తారు. భూభారతి పోర్టల్లో నమోదై భూ యజమానులందరికీ తహసీల్దార్లు సుమోటోగా పాసు పుస్తకాలు ఇస్తారు. దేనికైనా నిర్దేశిత ఫీజు చెల్లించాలి. హక్కుల రికార్డులో నమోదైన భూములను ఎప్పుడైనా లైసెన్సుడ్ సర్వేయర్ ద్వారా సర్వే చేయించుకోవచ్చు. ఈ సర్వే ద్వారా నిర్ధారించిన మ్యాప్ను పాసుపుస్తకాల్లో కూడా ముద్రించాల్సి ఉంటుంది. పాసు పుస్తకాల్లో తప్పులుంటే వాటిని సరిచేసుకునేందుకు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.