/rtv/media/media_files/2026/05/28/land-2026-05-28-19-47-48.jpg)
హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొడుతూ.. ఐటీ కారిడార్లోని రాయదుర్గంలో ఒకే ఒక్క ఎకరం భూమి ఏకంగా రూ. 237 కోట్లకు అమ్ముడుపోయింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గురువారం నిర్వహించిన ఈ-వేలంలో ఈ ఆల్టైమ్ రికార్డ్ నమోదైంది.
రాయదుర్గంలోని 6.29 ఎకరాల భూమికి జరిగిన ఈ వేలంలో ప్రముఖ సంస్థ గౌరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యధిక ధర పలికి ఈ ల్యాండ్ పార్సిల్ను కైవసం చేసుకుంది. ఇక్కడ అత్యాధునిక ఐటీ ఆఫీస్ టవర్స్, మిక్స్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు సమాచారం.
భారీ ఆదాయం
ప్రభుత్వం ఈ స్థలానికి ఎకరానికి కనీస ధర రూ. 139 కోట్లుగా నిర్ణయించగా.. గురువారం నాటి బిడ్డింగ్లో ఏకంగా 70 శాతం అదనంగా అంటే రూ. 237 కోట్లు పలికింది. దీనితో కేవలం ఈ 6.29 ఎకరాల భూమి విక్రయం ద్వారానే తెలంగాణ ప్రభుత్వానికి సుమారు రూ. 1,490 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గత ఏడాదిలో ఇదే రాయదుర్గం ప్రాంతంలో ఎకరం రూ. 177 కోట్లు పలికి అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ రికార్డును ఇప్పుడు రూ. 237 కోట్లతో తిరగరాయడం విశేషం.
రాయదుర్గంలో ప్రభుత్వం మొత్తం 6.29 ఎకరాలు, 5.09 ఎకరాల విస్తీర్ణం గల రెండు ల్యాండ్ పార్సిళ్లను వేలానికి ఉంచింది. గురువారం ఒక స్థలానికి వేలం ముగియగా.. మిగిలిన 5 ఎకరాల ప్లాట్కు జూన్ 1న వేలం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేషనల్ డెవలపర్లు ఈ వేలంలో హోరాహోరీగా పోటీ పడటంతోనే ఈ స్థాయి రికార్డు ధర సాధ్యమైందని అధికారులు తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలు, గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు రాయదుర్గం నిలయంగా ఉంది. అంతేకాకుండా ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్లు అయిన టీ-హబ్ ,టీ-వర్క్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. దీనికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ చాలా సులభంగా ఉండటంతో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
Follow Us