RTC Driver : ‘ముందు వడ్లు కొనండి సార్’.. అన్న RTC డ్రైవర్‌కు ఊహించని షాక్...అదేం లేదన్న మంత్రి పొన్నం...

జగిత్యాల జిల్లా కేంద్రంలోపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్వహించిన ధర్నాలో.. ప్రజా సమస్యలపై గళమెత్తిన ఒక ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై వేటు వేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

New Update
FotoJet (22)

RTC Driver

RTC Driver  : జగిత్యాల జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నిరసన కార్యక్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం నిర్వహించిన ధర్నాలో.. ప్రజా సమస్యలపై గళమెత్తిన ఒక ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై అధికారులు వేటు వేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే?

జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ అశోక్.. సోమవారం ధర్నా జరుగుతున్న సమయానికి అదే రూట్‌లో బస్సు నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడ జరుగుతున్న నిరసనను చూసి స్పందించిన ఆయన, “ముందు రైతుల వడ్లు, మక్కల (మొక్కజొన్న) కొనుగోళ్ల గురించి పట్టించుకోండి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఆ తర్వాత మాట్లాడొచ్చు” అంటూ బహిరంగంగా కామెంట్స్ చేశాడు. మంత్రి, ఎమ్మెల్యేల ముందే డ్రైవర్ ఈ వ్యాఖ్యలు చేయడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది.

అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే డ్రైవర్ అశోక్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం నుంచి ఆయనకు 'రిమూవల్ లెటర్' (విధుల నుంచి తొలగింపు ఉత్తర్వులు) జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై డ్యూటీకి రావద్దని అధికారులు ఆయనకు సూచించినట్లు తెలిసింది.ఈ పరిణామంపై డ్రైవర్ అశోక్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ రాజకీయ పార్టీని గానీ, ఏ ఒక్క నాయకుడిని గానీ వ్యక్తిగతంగా విమర్శించలేదని స్పష్టం చేశాడు. ఒక సాధారణ పౌరుడిగా, రైతుల పక్షాన నిలబడి వారి కష్టాల గురించే మాట్లాడానని.. కేవలం అన్నదాతల సమస్యలపై స్పందించినందుకే తనను ఉద్యోగంలో నుంచి తీసేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించాడు.

జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్య కాంగ్రెస్ నాయకుడి ప్రోద్బలంతోనే అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, డ్రైవర్‌ను తొలగించారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరందుకుంది. హైర్ బస్ ఓనర్ అసోసియేషన్‌లో సదరు కీలక నేతకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు సమాచారం అందుతోంది.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ వివరణ

జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో.. రైతుల సమస్యలపై మాట్లాడినందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగించారంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టతనిచ్చారు. ఈ ప్రచారమంతా పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. మంగళవారం సాయంత్రం తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసిన మంత్రి, ఈ వివాదానికి తెరదించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ అశోక్ ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగి కాదని, ఆయన ఒక ప్రైవేట్ అద్దె బస్సు (హైర్ బస్) డ్రైవర్ అని స్పష్టం చేశారు. అశోక్‌ను విధుల్లోంచి అస్సలు తప్పించవద్దని సదరు అద్దె బస్సు యజమానికి తామే స్వయంగా సూచించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ చిన్న విషయాన్ని కొందరు కావాలనే రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. డ్రైవర్ అశోక్ రైతుల పక్షాన మాట్లాడారని, ఒక పౌరుడిగా ఆయన అన్న మాటలను తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొనడం విశేషం.


"అశోక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం బస్సు యజమానికి చెప్పలేదు. ఇప్పుడే నేను ఆర్టీసీ ఎండీ (MD) తో కూడా మాట్లాడాను. డ్రైవర్ అశోక్ ఎప్పటిలాగే సదరు అద్దె బస్సులో తన విధులను నిర్వర్తించుకునే పూర్తి అవకాశం ఉంది." అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు