/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)
Maoists Surrender to Police
Maoist party : తెలంగాణలో మావోయిస్టు పార్టీకి ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలకమైన, అగ్రశ్రేణి విభాగమైన కేంద్ర కమిటీ (Central Committee) సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ, దశాబ్దాల పాటు అడవుల్లో గెరిల్లా పోరాటం చేసిన ఒక అగ్రనేత సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ, రక్షణ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థి దశ నుంచే అడవి బాట వైపు..
పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని సోమిడి గ్రామం. పసునూరి నర్సమ్మ–సోమనారాయణ దంపతుల ఐదుగురు కుమారుల్లో నరహరి రెండోవాడు. 1980వ సంవత్సరంలో వరంగల్లోని ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన నక్సలైట్ (మావోయిస్టు) సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితుడయ్యారు. అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నలతో ఏర్పడిన సాన్నిహిత్యం నరహరిని పూర్తిస్థాయి ఉద్యమం వైపు నడిపించింది.మొదట్లో తన గ్రామంలోనే ఉంటూ కూలీల రేట్లు పెంచడం కోసం, భూస్వాములు, రౌడీల అరాచకాలకు వ్యతిరేకంగా ఆయన తిరుగుబావుట ఎగురవేశారు. అప్పట్లో ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల (DTS-REC) పరిసరాల్లో చురుగ్గా ఉన్న ఉద్యమ నేతల ఉపన్యాసాలతో ప్రభావితమైన నరహరి, ఆ తర్వాత పోలీసుల నిర్బంధం తీవ్రం కావడంతో 1996లో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లి అడవి బాట పట్టారు.
పార్టీలో అంచలంచెలుగా ఎదిగి.. కీలక బాధ్యతల్లో..
ఉద్యమంలో చేరిన నాటి నుంచి నరహరి తన వ్యూహ చతురతతో పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. మావోయిస్టు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన కేంద్ర కమిటీలో సభ్యుడిగా స్థానం సంపాదించారు. దీంతో పాటు ఝార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగానికి ఇన్ఛార్జ్గా ఉంటూ పార్టీకి అవసరమైన సాంకేతిక సాయం, వ్యూహాల రచనలో కీలక పాత్ర పోషించారు. దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన పలు కీలక ఆపరేషన్లలో ఆయన నేరుగా పాల్గొన్నారు. ఆయన భార్య ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ కాగా, ఆమె కూడా పార్టీలోనే ఉంటూ కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఝార్ఖండ్లోని ప్రసిద్ధ ‘సరండా’ అడవుల్లో కేంద్ర రక్షణ బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ముమ్మర కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వంటి మోస్ట్ వాంటెడ్ అగ్రనేతలను పట్టుకోవడమే లక్ష్యంగా భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. ఒకవైపు అడవుల్లో సాయుధ బలగాల ఒత్తిడి తీవ్రం కావడం, మరోవైపు వయసు పైబడటంతో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో నరహరి దంపతులు అజ్ఞాత జీవితాన్ని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఝార్ఖండ్ అడవుల నుంచి రహస్యంగా తెలంగాణకు చేరుకుని, ఇక్కడి పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీకి తీరని లోటు
మావోయిస్టు పార్టీలో ఒక ప్రధాన సిద్ధాంతకర్తగా, బలమైన వ్యూహకర్తగా పేరున్న నరహరి లొంగుబాటు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు మరణించడం లేదా లొంగిపోతుండటంతో పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నరహరి దంపతుల లొంగుబాటు పార్టీ క్యాడర్ను మరింత నైతిక రక్షణ పరంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ లొంగుబాటుకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలను, నరహరిపై ఉన్న రివార్డు తదితర అంశాలను పోలీసు ఉన్నతాధికారులు త్వరలోనే మీడియాకు వెల్లడించనున్నారు.
Follow Us