2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ2కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించారు.
ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష ఖరారు అవ్వడంతో.. ప్రణయ్ కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు.#nalgonda #pranaycase #judgement #RTV pic.twitter.com/j7KRrHLcoR
— RTV (@RTVnewsnetwork) March 10, 2025
పరువు హత్యలు ఆగాలి..
ఈ సందర్భంగా ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని.. ఇలాంటి పనులు చేసే వారికి కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. తన కుమారుడు ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా కోల్పోయామన్నారు. అమృతకు భర్త లేడని.. తనకు కొడుకు.. మనవడికి తండ్రి లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసు విచారణలో సహకరించిన డీఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. వంద మంది సాక్షులు, 1600ల పేజీ ఛార్జ్ షీట్ తో అప్పటి ఎస్పీ రంగనాథ్ నిందితులకు శిక్ష పడేలా నిక్కచ్చిగా వ్యవహరించారని కొనియాడారు. న్యాయవాది దర్శనం నరసింహ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయ పోరాటం చేశారన్నారు. కొడుకు పోయిన బాధను తనకు ఎవరూ తీర్చలేరన్నారు.