KC Venugopal : హైకమాండ్ నిర్ణయంపై కేసీ వేణుగోపాల్ సంచలన కామెంట్స్

సీఎం రేసులో బలంగా నిలిచిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ క్రమశిక్షణ గల నాయకుడిగా స్పందించారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను.

New Update
kc venugopal

పదిరోజులుగా ఉత్కంఠ రేపిన కేరళం  ముఖ్యమంత్రి పీఠం సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల నుంచి ఎదురైన గట్టి పోటీని తట్టుకుని, ప్రస్తుత ప్రతిపక్ష నేత, 61 ఏళ్ల వీడీ సతీశన్ కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. పార్టీ ప్రయోజనాలు, మిత్రపక్షాల మద్దతును పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ హైకమాండ్ సతీశన్ వైపే మొగ్గు చూపింది.

ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును ఖరారు చేసిన తర్వాత, సీఎం రేసులో బలంగా నిలిచిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ క్రమశిక్షణ గల నాయకుడిగా స్పందించారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. అధిష్ఠానం నిర్ణయానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను" అని వేణుగోపాల్ స్పష్టం చేశారు. వ్యక్తిగత ఆశయాలు, పదవుల కన్నా పార్టీ ప్రయోజనాలకే తాను ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

తాను కేవలం పదవుల కోసం ఆశపడే వ్యక్తిని కాదని, పార్టీకి మరియు ప్రభుత్వానికి ఎలాగైనా సేవ చేస్తానని రాహుల్ గాంధీకి ముందే తెలిపినట్లు కేసీ వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిననే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. కేరళ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. అంతా ఒకతాటిపైనే ఉన్నామని స్పష్టం చేశారు.

102 సీట్ల భారీ మెజారిటీతో

కాగా మే 4న వెలువడిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి 102 సీట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించింది. మొత్తం 140 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ ఒంటరిగానే 63 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షాలు (ముస్లిం లీగ్ వంటివి) కలిపి మరో 39 స్థానాలను దక్కించుకున్నాయి. అయితే, ఇంతటి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడానికి కాంగ్రెస్ అధినాయకత్వానికి వారం రోజులకు పైగా సమయం పట్టింది. 

దానికి కారణం సీఎం పీఠం కోసం కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల, వీడీ సతీశన్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకొనడమే. చివరకు కేరళలో క్షేత్రస్థాయిలో ఉన్న లీడర్ల సెంటిమెంట్, మిత్రపక్షాల అభిప్రాయాలను గౌరవిస్తూ హైకమాండ్ వీడీ సతీశన్ వైపు మొగ్గు చూపింది. కేసీ వేణుగోపాల్ కూడా దీనికి సహకరించడంతో కేరళ కాంగ్రెస్‌లో ఎలాంటి ముఠా తగాదాలు లేకుండా సుఖాంతమైంది.

Advertisment
తాజా కథనాలు