/rtv/media/media_files/2026/04/22/fotojet-2026-04-22-08-04-10.jpg)
Banglore Byadarahalli Lovers Incident
Crime News : బెంగళూరు నగరంలో అత్యంత కిరాతకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పిలిచి, నమ్మించి ఓ యువతి తన ప్రియుడిని సజీవదహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరంలోని బ్యాడరహళ్ళి పోలీస్స్టేషన్ పరిధి అంజనానగర్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణంలో కిరణ్ (27) అనే యువకుడు మంటల్లో కాలి కుర్చీలోనే ప్రాణాలు విడిచాడు. నిందితురాలు ప్రేమ అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. తుమకూరుకు చెందిన కిరణ్, నిందితురాలు ప్రేమ ఒకే టెలికాం స్టోర్లో పనిచేస్తూ గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేస్తున్నాడనే అనుమానం ప్రేమలో పెరిగిపోయింది. ఈ క్రమంలో అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, పక్కా పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కిరణ్ను రమ్మని ఆహ్వానించింది.
కిరణ్ ఇంటికి రాగానే 'సర్ప్రైజ్' ఇస్తానంటూ ప్రేమ అతడి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం వెస్ట్రన్ స్టైల్లో కొత్తగా ఉంటుందని నమ్మబలికి అతడి దుస్తులు విప్పేసి, కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా కట్టేసింది. కిరణ్ ఏమీ ఊహించని తరుణంలో ఒక్కసారిగా అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కిరణ్ మంటల్లో కాలిపోతూ హాహాకారాలు చేస్తున్నా కనికరం లేకుండా ఆమె తన సెల్ఫోన్లో వీడియో తీయడం ఈ ఘటనలోని పాశవికతకు నిదర్శనంగా నిలిచింది.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, నిందితురాలు తొలుత కథ మార్చి చెప్పింది. తాను బాత్రూమ్కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, లోపల ఏదో కాలుతున్న వాసన రావడంతో బయటకు వచ్చి చూసేసరికి కిరణ్ మంటల్లో ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు ఘటనా స్థలంలో కుర్చీకి కట్టివేసి ఉన్న తీరును చూసి అనుమానించి, తమదైన శైలిలో విచారించడంతో ఆమె నేరాన్ని అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ తెలిపారు.
Follow Us