/rtv/media/media_files/2026/05/15/petrol-and-diesel-prices-hiked-2026-05-15-11-11-23.jpg)
Diesel
Diesel : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా చూసేందుకు డీజిల్ రిటెయిల్ విక్రయాలపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఇకపై పెట్రోల్ బంకుల్లో ఒక వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు సాధారణ బంకుల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. వీరంతా తమ అవసరాల కోసం సొంతంగా ఉన్న కన్జూమర్ పంప్స్ ద్వారానే ఇంధనాన్ని సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది.
సాధారణ రిటెయిల్ ధరలకు, వాణిజ్య (బల్క్) ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ఈ ఆంక్షలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఉదాహరణకు ఢిల్లీలో లీటర్ డీజిల్ రిటెయిల్ ధర రూ.95.20 కాగా, బల్క్ ధర రూ.134.50 గా ఉంది. ఈ ధరల వ్యత్యాసం వల్ల టెలికాం టవర్లు, ఫ్యాక్టరీలు, జనరేటర్ల నిర్వాహకులతో పాటు ప్రైవేట్ బస్సులు, ట్రక్కుల కంపెనీలు కూడా మార్కెట్ రేటుకు కాకుండా సాధారణ పెట్రోల్ బంకులను ఆశ్రయించడం మొదలుపెట్టాయి. పైగా ప్రైవేట్ బంకుల్లో ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులంతా ప్రభుత్వ రంగ చమురు సంస్థల (BPCL, HPCL, IOC) బంకులకే పోటెత్తారు. దీనివల్ల మే నెలలో ప్రభుత్వ కంపెనీల పెట్రోల్ అమ్మకాలు 4.8%, డీజిల్ అమ్మకాలు 6.4% మేర అసాధారణంగా పెరిగాయి.
ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంకుల నుంచి జరిగే బల్క్ కొనుగోళ్లను నియంత్రించాలని జూన్ 11న చమురు మార్కెటింగ్ కంపెనీలను పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. బంకుల్లో డీజిల్ను నేరుగా వాహనం ట్యాంక్ లేదా 'పెసో' (PESO) ఆమోదించిన కంటెయినర్లలో మాత్రమే నింపాల్సి ఉంటుంది. ఇలా కొనుగోలు చేసిన ఇంధనాన్ని మరొకరికి తిరిగి విక్రయించడం పూర్తిగా చట్టవిరుద్ధం. ప్రాథమికంగా 90 రోజుల పాటు అమలులో ఉండే ఈ నిబంధనల నుండి ఏదైనా ప్రత్యేక ప్రాంతానికి, నిర్దిష్ట వినియోగదారులకు లేదా అత్యవసర లావాదేవీలకు మినహాయింపు ఇచ్చే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది.
ఈ నూతన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ మరియు అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే 'నిత్యావసర వస్తువుల చట్టం' కింద శిక్షార్హులవుతారని నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంధన దుర్వినియోగాన్ని అరికట్టి, దేశవ్యాప్తంగా సామాన్య వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇంధన సరఫరాను సమతుల్యం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ అడుగులు వేసింది.
Follow Us