రామలక్ష్మణులు వలస కూలీలు.. ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. గతంలో అనేకమార్లు రాజకీయ, సామాజిక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈసారి హిందూ ధర్మం అత్యంత పవిత్రంగా భావించే రామాయణంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి.

New Update
prakash raj

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. గతంలో అనేకమార్లు రాజకీయ, సామాజిక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈసారి హిందూ ధర్మం అత్యంత పవిత్రంగా భావించే రామాయణంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా ఆయన వివాదస్పద వ్యాక్యలు చేశారు. 

ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. రామాయణాన్ని తనదైన శైలిలో విశ్లేషించారు. శ్రీరాముడు, లక్ష్మణులను ‘ఉత్తర భారతం నుండి వచ్చిన వలస కూలీలు’గా ఆయన అభివర్ణించారు. వారు దక్షిణాదికి వచ్చి, ఒక గిరిజనుడైన రావణుడికి చెందిన పొలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారని పేర్కొన్నారు. ఈ దొంగతనాన్ని రావణుడు ప్రశ్నించినందుకే వారి మధ్య వివాదం మొదలైందని, అది కాస్తా పెద్ద యుద్ధానికి దారితీసిందని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, శూర్పణఖ ప్రస్తావన తెస్తూ.. ఆమె జీఎస్టీతో కలిపి 2000 డాలర్లు చెల్లించాలని కోరినట్లుగా ఎద్దేవా చేయడం గమనార్హం. పవిత్ర ఇతిహాసాన్ని ప్రస్తుత పన్నుల విధానంతో ముడిపెట్టి ఆయన చేసిన వ్యగ్య విమర్శలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భగ్గుమంటున్న హిందూ సంఘాలు

ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంస్థలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోట్ల మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని ‘పండ్ల దొంగ’గా, ‘వలస కూలీ’గా చిత్రీకరించడం కేవలం అజ్ఞానమే కాదని, కావాలనే ఒక వర్గం మనోభావాలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనను అరెస్ట్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయనపై మతపరమైన విద్వేషాలను ప్రేరేపించినందుకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ఉత్తర-దక్షిణ విభేదాల చిచ్చు?

ప్రకాశ్ రాజ్ మాటలు కేవలం మతానికే పరిమితం కాకుండా, ఉత్తర, దక్షిణ భారతం మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రావణుడిని దక్షిణాది గిరిజనుడిగా, రాముడిని ఉత్తరాది వలస వ్యక్తిగా చూపడం ద్వారా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం డీలిమిటేషన్ బిల్లు గురించి లోక్ సభలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.  గతంలోనూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ప్రకాశ్ రాజ్, తాజా వివాదంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు