/rtv/media/media_files/2026/04/04/nasik-2026-04-04-10-45-30.jpg)
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లడంతో అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం డిండోరీ ప్రాంతంలో జరిగింది.
పోలీసుల సమాచారం ప్రకారం, డిండోరీకి చెందిన ఒకే కుటుంబం శివాజీనగర్లో జరిగిన ఒక వేడుకకు హాజరై, తిరిగి కారులో ఇంటికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మార్గమధ్యంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక లోతైన బావిలో పడిపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, రెండు క్రేన్లు మరియు గజ ఈతగాళ్ల సహాయంతో కారును, మృతదేహాలను బయటకు తీశారు.
ఆరుగురు చిన్నారులు
ఈ విషాద ఘటనలో సునీల్ దత్తు దర్గుడే (32), ఆయన భార్య రేష్మా, అలాగే ఆశా అనిల్ దర్గుడే (32) మరణించారు. వీరితో పాటు కుటుంబంలోని ఆరుగురు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. మరణించిన పిల్లల్లో ఒక 11 ఏళ్ల బాలుడు, 7 నుండి 14 ఏళ్ల మధ్య వయసు గల ఐదుగురు బాలికలు ఉన్నారు.
ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, కారు అదుపుతప్పడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది, అందులోనూ ఆరుగురు పిల్లలు మృత్యువాత పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుల జాబితా
1. సునీల్ దత్తాత్రేయ దర్గోడ్ (వయస్సు 32)
2. రేష్మా సునీల్ దర్గోడ్ (వయస్సు 27)
3. ఆశా అనిల్ దర్గోడ్ (వయస్సు 32)
4. గుణవతి సునీల్ దర్గోడ్ (వయస్సు 11)
5. శ్రేయాష్ అనిల్ దర్గోడ్ (వయస్సు 11)
6. శ్రావణి అనిల్ దర్గోడ్ (వయస్సు 11)
7. సృష్టి అనిల్ దర్గోడ్ (వయస్సు 14)
8. సమృద్ధి రాజేంద్ర దర్గోడ్ (వయస్సు 7)
9. శ్రద్ధా అనిల్ దర్గోడే (వయస్సు 13)
Follow Us