/rtv/media/media_files/2026/05/01/mp-2026-05-01-13-24-05.jpg)
ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహారాష్ట్ర దినోత్సవ వేడుకల వేళ వేలాది వాహనాలు రోడ్డెక్కడంతో ప్రయాణికులు గంటల తరబడి నడిరోడ్డుపైనే చిక్కుకుపోయారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎక్స్ప్రెస్వేలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా లోనావాలా, ఖండాలా ఘాట్ సెక్షన్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లైవ్ ట్రాఫిక్ మ్యాప్లలో ఈ ప్రాంతాలన్నీ ఎరుపు రంగులో కనిపించాయి.
మహారాష్ట్ర దినోత్సవ వేడుకల కోసం పుణె వెళ్తున్న ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే కూడా ఈ ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఆమె వాహనం కదలకపోవడంతో, ఆమె కిందికి దిగి తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు గంటలుగా ఇక్కడే ఉన్నామని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎక్స్ప్రెస్వేపై ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలోనే, ప్రయాణికులకు ఉపశమనం కలిగించే మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ నేడు ప్రజలకు అందుబాటులోకి వస్తోంది.
కొత్త మిస్సింగ్ లింక్
ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడం వల్ల ముంబై-పుణె మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. పశ్చిమ కనుమలలోని కొండలు, లోయల గుండా సొరంగాలు, వంతెనల ద్వారా ఈ షార్ట్కట్ నిర్మించబడింది. ఇకపై వాహనదారులు పాత ఘాట్ రోడ్డు గుండా ప్రకృతి అందాలను చూస్తూ వెళ్లవచ్చు లేదా ఈ కొత్త మిస్సింగ్ లింక్ ద్వారా త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చు. ముంబై-పుణె ప్రయాణంలో దశాబ్దాలుగా ఉన్న ఘాట్ సెక్షన్ ట్రాఫిక్ కష్టాలకు ఈ కొత్త ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Follow Us