/rtv/media/media_files/2026/05/17/rajadhani-2026-05-17-09-03-37.jpg)
మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ (ట్రెయిన్ నెం: 12431) ఏసీ బోగీలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్ బలగాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో బోగీలోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఆదివారం తెల్లవారుజామున 5:15 నుంచి 5:30 గంటల సమయంలో కోటా రైల్వే డివిజన్ పరిధిలోని లూని రిచా - విక్రమ్గఢ్ ఆలోట్ స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్కు కాస్త దగ్గరగా ఉన్న బి-1 (B1) ఏసీ కోచ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కేవలం కొన్ని సెకన్లలోనే మంటలు బోగీ అంతటా వేగంగా వ్యాపించాయి.
బోగీలో 68 మంది ప్రయాణికులు
రైలు గార్డ్ మొదట మంటలను గమనించి వెంటనే లోకో పైలట్ ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు. ఆ సమయంలో ఆ బోగీలో 68 మంది ప్రయాణికులు ఉన్నారు. రైల్లోని ఆర్పీఎఫ్ (RPF) సిబ్బంది, రైల్వే సిబ్బంది క్షణాల్లో రంగంలోకి దిగి ప్రయాణికులను కిందకు దించేశారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే బోగీ మొత్తాన్ని ఖాళీ చేయించారు. దీంతో ప్రయాణికులకు గానీ, రైల్వే సిబ్బందికి గానీ ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణనష్టం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ (OHE) విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మంటలు అంటుకున్న బి-1 బోగీని రైలు నుంచి వేరు చేశారు.
ఈ బోగీలోని ప్రయాణికులను కోటా వరకు మిగిలిన బోగీలలో సర్దారు. కోటా స్టేషన్లో రైలుకు అదనపు బోగీని అమర్చి ప్రయాణాన్ని కొనసాగించనున్నారు. ఢిల్లీ-ముంబై ప్రధాన రైల్వే మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్ల వివరాలు:
ట్రెయిన్ 12955 - మహీద్పూర్ రోడ్ స్టేషన్
ట్రెయిన్ 19020 - శామ్గఢ్ స్టేషన్
ట్రెయిన్ 12416 - సువాస్ర స్టేషన్
ట్రెయిన్ 12472 (స్వరాజ్ ఎక్స్ప్రెస్) - శామ్గఢ్ స్టేషన్
ట్రెయిన్ 22210 - చౌమహ్లా స్టేషన్
ట్రెయిన్ 01492 (పుణే స్పెషల్) - మోదక్ స్టేషన్
ట్రెయిన్ 05017 - నాథూ ఖేడీ స్టేషన్
షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయా లేక మరేదైనా కారణమా అనే కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Follow Us