సోనియాగాంధీ దెబ్బకు.. ఖమేనీ మృతిపై 6 రోజుల తర్వాత భారత్ రియాక్ట్

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య భారత రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపింది. గత నెల 28న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించినప్పటికీ, భారత ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.

New Update
_India condoles

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య ఉదంతం భారత రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపింది. గత నెల 28న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించినప్పటికీ, భారత ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ చేసిన విమర్శలతో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తన మౌనాన్ని వీడి అధికారికంగా సంతాపం వ్యక్తం చేసింది. సోనియా గాంధీ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఖమేనీ మరణించిన ఆరు రోజుల తర్వాత భారత్ అధికారికంగా సంతాపం తెలిపింది. గురువారం ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సంతాప పుస్తకంలో ఆయన సంతకం చేసి, భారత ప్రభుత్వం తరపున నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇరాన్ రాయబార కార్యాలయం తమ దేశ జెండాను సగానికి అవనతం చేసి ఖమేనీకి వీడ్కోలు పలికింది.

సోనియా గాంధీ ప్రశ్నలు 

ఖమేనీ మృతిపై కేంద్రం వ్యవహరించిన తీరును సోనియా గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో రాసిన ఒక ప్రత్యేక వ్యాసంలో ఆమె కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చర్చలు జరుగుతున్న సమయంలో ఒక దేశాధినేతను హత్య చేయడం అంతర్జాతీయ న్యాయానికి, సార్వభౌమత్వానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. భారత్ మౌనంగా ఉండటం అంటే ఈ హత్యను సమర్థించినట్లే అవుతుందని, ఇది దేశ విదేశాంగ విధానానికే ప్రమాదకరమని హెచ్చరించారు. ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులను ప్రధాని మోడీ ఖండించారు కానీ, ఆ దాడులకు దారితీసిన ఖమేనీ హత్యపై ఎందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు. రష్యా, చైనా వంటి దేశాలు ఆచితూచి వ్యవహరిస్తుంటే, భారత్ తన సంప్రదాయ విదేశాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ అంశంపై బడ్జెట్ సమావేశాల రెండో విడతలో పార్లమెంటులో చర్చ చేపట్టాలని సోనియా డిమాండ్ చేశారు.

మొత్తానికి, అంతర్జాతీయ సంబంధాల విషయంలో భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనంపై విపక్షాలు గళమెత్తడం, దానికి ప్రభుత్వం స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య భారత్ తన తటస్థ వైఖరిని కాపాడుకోవడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ ఘటన ప్రతిబింబిస్తోంది.

Advertisment
తాజా కథనాలు